
జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూ భారతి చట్టం ద్వారా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తహసీల్దార్లు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించి వెంటనే పంపాలని ఆదేశించారు. తహసీల్దార్, డీటీ ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ లాగిన్లో ఉన్న రేషన్కార్డులకు సంబంధించిన దరఖాస్తులను తనిఖీ చేసి పంపించాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలను పర్యవేక్షించాలని, ధాన్యం రవాణా, మిల్లుకు తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండాచర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వర్షాలకు పడకుండా అన్ని ముందు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. రేషన్కార్డు దారులకు జూన్ 1 నుంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో చౌక ధర దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించాలని, రేషన్షాపుల్లో స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ సువర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు.