
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
ధరూరు/ రాజోళి/ దోమలపెంట: ఉమ్మడి జిల్లా పరిధిలోని కృష్ణానదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,064 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా వస్తున్న ఇన్ఫ్లోలు ఆదివారం స్వల్పంగా తగ్గినటు్ల్ వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.271 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
సుంకేసుల డ్యాంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. రెండు గేట్లను తెరిచి అంతే స్థాయిలో దిగువన ఉన్న శ్రీశైలానికి వదిలారు. అలాగే కేసీ కెనాల్కు 159 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలానికి 8,841 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయానికి సుంకేసుల డ్యాం నుంచి ఆదివారం 8,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 818.2 అడుగుల వద్ద 39.4936 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి దిగువనున్న నాగార్జునసాగర్కు 7,259 క్యూసెక్కుల నీటిని వదిలారు. స్థానికంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.