
నిరుద్యోగులకు ఉపాధి
నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది.
నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు..
భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు.
నిజాం పాలనలోని సర్వే వివరాలే కొలమానం
నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూశాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దరఖాస్తుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది.
50 రోజులపాటు శిక్షణ
ఇంటర్లో గణితం ఓ సబ్జెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), బీటెక్ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ కోర్సులు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మీసేవ ద్వారా ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించారు. వీరిలో నుంచి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేసి 50 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. థియరీ, టిప్పన్, ప్లాటింగ్, ఫీల్డ్ వర్క్ తదితర మూడు విభాగాల్లో శిక్షణ తీసుకొని తదుపరి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ సర్టిఫికెట్ అందజేస్తారు. భవిష్యత్లో భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులు సర్వేకు సంబంధించిన సమస్య పరిష్కారానికి, నక్ష వేయించుకోవడానికి ఈ ధ్రువపత్రం కలిగిన వారు ఇచ్చేవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
సర్వేయర్ల కొరత తీరనుంది
భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ ఇవ్వనుంది. ఎంపికై న సర్వేయర్లతో ప్రైవేట్ భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించునున్నారు. భూ కొలతలకు వారిని వినియోగించుకోనున్నారు. – గిరిధర్,
జిల్లా సర్వే అధికారి, నారాయణపేట
‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు..
లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు

నిరుద్యోగులకు ఉపాధి