
రైతుల కష్టాలు అధికారులకు పట్టవా..?
● ధాన్యం దింపుకోవడంలో మిల్లర్ల కాలయాపన
● ఆగ్రహించిన రైతులు.. జాతీయ రహదారిపై ధర్నా
● మాగనూర్, మరికల్లో రైతుల నిరసన
మాగనూర్: ఆరుగాలం కష్టపడి వరి పంట పండించామని.. కానీ, దానిని విక్రయించేందుకు సైతం మరిన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురించిందని, మా కష్టాలు అధికారులకు పట్టవా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మాగనూరు మండలంలోని వైష్ణవి మిల్లు యాజమాన్యం ధాన్యం కోనుగోలు చేయకపోవడంతోపాటు క్వాంటిటీ ముగిసిందని చెప్పి ఇబ్బందులకు గురిచేయడం, తరుగు పేరుతో 3 కిలోల వరకు తీసేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాగనూర్ మండల కేంద్రంలోని వడ్వాట్ క్రాస్ రోడ్డు దగ్గర ఎన్హెచ్–167 పై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చివరి గింజ వరకు బోనాస్ ఇచ్చి మరి కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారాయని అన్నారు. ఒక్కవైపు సమ యానికి గన్నీ బ్యాగులు, లారీలు అందక ఇబ్బందులు పడుతుంటే మళ్లీ మీలర్ల మోసానికి బలి అవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సీఈవో అంజనేయులు, మండల ఇన్చార్జ్ ఏజో సుదర్శన్గౌడ్, మక్తల్ సిఐ రాంలాల్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో అధికారులతో ఫోన్లో మాట్లాడి మిల్లుల క్వాంటిటీ పెంచే విధంగా చూసి రైతులకు ఇబ్బందులు కలగుండా చుట్టు పక్కల మిల్లుల వారు ధాన్యాన్ని సేకరించేలా చూడాలని తెలిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. అధికారులు స్వయంగా మిల్లు దగ్గరకు వెళ్లి రైతుల ధాన్యాన్ని దింపించారు. ధర్నా కారణంగా గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది.
ధాన్యం అన్లోడ్ చేసే వరకు కదలం..
మరికల్: మిల్లు వద్ద మూడు రోజులుగా ధాన్యంతో ఎదురుచూస్తున్నామని.. తీరా ఇప్పుడు మా మిల్లు కు కేటాయించిన ధాన్యం టార్గెట్ పూర్తి అయ్యిందని.. మేం అన్లోడ్ చేసుకోమని అంటే ఎలా అంటూ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మరికల్ మండలం కన్మనూర్ మిల్లు వద్ద నిరసన చేపట్టారు. మూడు రోజుల క్రితం ఎక్లాస్పూర్, జిన్నారం, బూ డ్యాగానితండా, చిత్తనూర్ గ్రామాల నుంచి 60కి పైగా ట్రాక్టర్ల ధాన్యం కన్మనూర్ మిల్లుకు తీసుకురావడం జరిగిందన్నారు. వరుస క్రమంలో వచ్చిన ట్రాక్టర్లకు టోకన్లు కూడా ఇచ్చారని, ఇప్పుడు దించుకోమని చెప్పడంతో తమ పరిస్థితి ఏంటని రైతు లు అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మిల్లు యాజమానితో మాట్లాడగా సివిల్ సప్లయ్ అధికారులు తమ మిల్లుకు కేటాయించిన టార్గెట్ పూర్తి కావడంతో ధాన్యం దించుకోవద్దని ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో అగ్రహించిన రైతులు ట్రాక్టర్ల నుంచి ధాన్యం దించుకునే వరకు ఇక్కడి నుంచి కది లేది లేదని ఆందోళనకు దిగారు. ఇక్కడ మూడు రో జులు పాటు వేచి చూసి కాదు పోమ్మంటే ఎలా అంటూ ప్రశ్నించారు. మరో మిల్లుకు ధాన్యం తరలించే ప్రసక్తేలేదని వారు తేల్చి చెప్పారు. అధికారులు చెబి తే టోకెన్లు ఇచ్చిన ట్రాక్టర్ల వరకు ధాన్యం దించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అంతకు మించి తాము ఏం చేయలేమని రైతులకు మిల్లర్లు వివరించారు. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల కష్టాలు అధికారులకు పట్టవా..?