
మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): సమాజంలో మహిళలపై అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సమర్పించడానికి విద్యార్థులతో సంతకాల సేకరిస్తున్నామన్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫోర్న్ వీడియోల ప్రభావంతో అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుందని, సమాజంలో అమ్మాయిలు, చిన్నారులు ఇలా బలి కావాల్సిందేనా అని ప్రశ్నించారు. మన దేశంలో పేదరికం, మహిళల పట్ల మూఢనమ్మకాలు పెరిగి పోతున్నాయన్నారు. వీటిని కట్టడి చేయడానికి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీదేవి, సభ్యురాలు మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులుకాపాడుకుందాం
మహబూబ్నగర్ న్యూటౌన్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు కలిసిరావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ అన్నారు. సోమవారం ఆల్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, బొగ్గు, విమానయాన, చమురు సంస్థలను కారుచౌకగా స్వదేశి, విదేశి కార్పొరేట్లకు అమ్మేస్తుందని ఆరోపించారు. 2015లో పార్లమెంట్లో నరేంద్రమోదీ ఇచ్చిన కనీస మద్దతు ధర హామీని ఇప్పటికీ అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికలందరికీ కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధరాత్రి వరకు చేపట్టే జన జాగరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రాములు, కురుమూర్తి, రామ్మోహన్, చంద్రకాంత్, రాజ్కుమార్, బాబుమియా, వినయ్, అశ్విన్, గోపాల్, రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల వర్క్
అడ్జస్ట్మెంట్ వివరాలివ్వండి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్కు సంబంధించి మంగళవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని డీఈఓ రవీందర్ అన్నారు. సోమవారం మండల నోడల్ అధికారులతో డీఈఓ కలెక్టరేట్లో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో న్యూట్రిగార్డెన్స్ ఏర్పాటు చేయాలని, మునగ, నిమ్మ వంటి చెట్లు పెంచాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే సమర్పించాలని, ఇన్స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించాలని, అధికారులు పాఠశాలలను తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, ఎఫ్ఏఓ యాదగిరి, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.

మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి