
మహబూబ్నగర్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫలితంగా కాంగి‘రేసు’లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరులో 14 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు ఎనిమిదింట (షాద్నగర్, కొడంగల్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, అలంపూర్, గద్వాల) అభ్యర్థులను ఖరారు చేస్తూ.. తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండో జాబితా నేడో, రేపో విడుదల కానుండగా.. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించి ప్రాబబుల్స్లో ఉన్న పేర్లలో చేర్పులు జరిగినట్లు సమాచారం.
4 స్థానాల్లో ఖరారు..
ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, మహబూబ్నగర్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితా వెల్లడికి సంబంధించి ఇందులో జడ్చర్లలో అనిరుధ్రెడ్డి ఖరారైనట్లు సమాచారం.
మహబూబ్నగర్లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్రలో డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్రెడ్డి, కాటం ప్రదీప్కుమార్ గౌడ్, వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, మక్తల్లో నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, సిద్ధార్థ్రెడ్డి, నారాయణపేటలో కుంభం శివకుమార్రెడ్డి, ఫర్నికారెడ్డి, ఎర్రశేఖర్ పేర్లు సీడబ్ల్యూసీకి అందినట్లు సమాచారం.
అయితే రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేపట్టిన ముఖ్య నేతలు నారాయణపేట, మక్తల్ మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.
బలంగా ఢీకొనాలంటే..
అధికార పార్టీలో ధిక్కార స్వరాన్ని వినిపించిన బీఆర్ఎస్ నేతలను సమన్వయం చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులను కలుపుకుంటూ పోతున్న బీకేఆర్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని బలంగా ఢీకొనాలంటే ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచించినట్లు తెలుస్తోంది.
తన కుటుంబసభ్యుడు లక్ష్మారెడ్డి గతంలో జెడ్పీటీసీగా ఉండడం.. బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారగా.. నేడో, రేపో విడుదల కానున్న జాబితాపై ఉత్కంఠ నెలకొంది.