వరంగల్ స్పోర్ట్స్: పెత్తందారులు, అగర్వాల్, తమిళీయులు, తెలంగాణేతరుల కబంధహస్తాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనసాగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్సీఏలో నిధుల దుర్వియోగం, ఇతర అక్రమాలపై విచారణ జరపాలనే టీసీఏ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగిందన్నారు. విచారణలో రూ.660 కోట్లు దుర్వినియోగమైనట్లు సీఐడీ గుర్తించిందని, అందులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతరులు జైలుకెళ్లారన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. 70 సంవత్సరాలుగా వందల కోట్ల హెచ్సీఏ నిధులను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రతీ ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. హెచ్సీఏ అక్రమాలపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలోనే టీసీఏకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో మినీస్టేడియం నిర్మాణానికి 8 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. వచ్చే ఏడాదిలో రంజీ మ్యాచ్ నిర్వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. స్టేడియంతోపాటు నగరంలో ఎక్సలెన్సీ ఆఫ్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఫైనల్ చేసి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ అలీం, సీనియర్ క్రికెటర్ జయచందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి


