వేతనాల్లో కోత
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా స్కావెంజర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. శ్రమకు తగిన వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల హెచ్ఎంలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు తాత్కాలిక పద్ధతిలో స్కావెంజర్లను నియమించుకున్నారు. వారు ప్రతీరోజు పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, మొక్కలకు, చెట్లకు నీరు పడుతున్నారు. అయితే వారికి జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. రూ.1,000 చెల్లించి మమ అనిపిస్తున్నారని పలువురు స్కావెంజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో 765 పాఠశాలలు..
మానుకోట జిల్లాలో 765 పాఠశాలలు ఉండగా, దాదాపు 40,670 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి 30మంది విద్యార్థుల ఉన్న పాఠశాలలు 429 ఉన్నాయి. 31 నుంచి 100మంది ఉన్న పాఠశాలలు 248 ఉండగా, 101 నుంచి 250మంది ఉన్న స్కూళ్లు 62 ఉన్నాయి. 251 నుంచి 500మంది విద్యార్థులు గల పాఠశాలలు 14 ఉండగా, 501 నుంచి 750మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కావెంజర్లకు జీతాలు మాత్రం చెల్లించడం లేదు. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు మాత్రమే చెల్లిస్తూ చేతులు దుపులుకుంటున్నారని స్కావెంజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
తక్కువ జీతం ఇస్తున్నారు..
పాఠశాలకు ఉదయం పూట వచ్చి తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లను శుభ్రం చేస్తా. పుట్టెడు కష్టం చేసినా జీతం మాత్రం నెలకు రూ.1,000 ఇస్తున్నారు. సార్ జీతం పెంచండి అని అడిగితే వచ్చే నెల నుంచి రూ.1,500 ఇస్తానని చెప్పారు. పెద్ద సార్లు కనికరించి జీతాలు పెంచాలి. – ఉపేంద్ర,
ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్, మానుకోట
స్కావెంజర్లకు అందని మొత్తం జీతం
శ్రమ దోపిడీకి గురవుతున్న సిబ్బంది
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
వేతనాల్లో కోత


