
ప్రభంజన్ కుమార్ కన్నుమూత
బహుజన ఉద్యమకారుడు
పాలకుర్తి టౌన్/ జనగామ: బహుజన, సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ యాదనాల ప్రభంజన్కుమార్ యాదవ్(62)బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ప్రభంజన్కుమార్ స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడురు గ్రామం. ప్రముఖ రచయిత, కవి గూడ అంజయ్య సోదరుడి కూతురు, మంచిర్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ప్రభంజన్కుమార్ నిజామాబాద్లో డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండియన్ ఇన్మర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) సాధించారు. 1998లో ఐఐఎస్ అధికారిగా ఆలిండియా రేడియోలో డిప్యూటీ ఎడిటర్గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత జాతీయ ప్లానింగ్ కమిషన్ పీఆర్ఓగా కొద్ది రోజులు పనిచేసి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తూ డోలుదెబ్బ, యాదవ ఇంటలెక్చువల్ ఫోరం స్థాపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చిత్రం రూపురేఖలను మొదట ప్రజంటేషన్ చేశారు. కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల్లో జర్నలిజం విభాగాలను స్థాపించడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి 2017లో వీఆర్ఎస్ తీసుకున్నారు. పలు పత్రికలతోపాటు విద్యారంగానికి అనేక విధాలా సేవలందించారు.
జనగామ మెడికల్ కాలేజీకి
పార్థివదేహం అప్పగింత..
ప్రొఫెసర్ డాక్టర్ యాదనాల ప్రభంజన్కుమార్ యాదవ్ పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు జనగామ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతకుముందు మృతదేహాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జీవీ వెన్నల సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కదిరే కృష్ణ, బత్తుల సిద్దేశ్వర్, రచయితలు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ, కన్నా పరుశరాములు, కోలా జనార్ధన్, మెరుగు బాబు యాదవ్, గుమ్మడిరాజు సాంబయ్య, పులి గణేశ్,సంగి వెకన్న సంతాపం తెలిపారు.
మాజీ సీఎం సంతాపం
ప్రభంజన కుమార్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రభంజన్ కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పార్థివదేహం జనగామ మెడికల్
కాలేజీకి అప్పగింత
మాజీ సీఎం కేసీఆర్తోపాటు పలువురు ప్రముఖుల సంతాపం

ప్రభంజన్ కుమార్ కన్నుమూత