
నేడు ‘డయల్ యువర్ డీఎం’
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శ నివారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 12నుంచి 1గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలని డీఎం అన్నారు.
విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి
డోర్నకల్: విద్యాశాఖలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. సీరోలు మండలం మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రమేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో 26జిల్లాలకు ఇన్చార్జ్ డీఈఓలు ఉన్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత డిప్యూటీ డీఈఓల నియామకాలు చేపట్టలేదన్నారు. 596 మండలాల్లో ఇన్చార్జ్ ఎంఈఓలు ఉన్నారని తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా రెండు శాతం ఉపాధ్యాయులను పర్యవేక్షణాధికారులుగా నియమిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు అక్కినపల్లి బాబూరావు, ప్రధాన కార్యదర్శి విద్యాపాగర్, కార్యదర్శి సింగం మనోహర్, సునీల్కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం రుచిగా వండాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచిగా వండాలని, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారి వి.దర్మేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వి.ధర్మేందర్ మాట్లాడుతూ.. వంటలు రుచిగా ఉండేవిధంగా చూడల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, వంట నిర్వాహకులు వర్షాకాలంలో పలు జాగ్రతలు పాటించాలన్నారు. విద్యార్థులు భోజనం రుచిగా లేకపోతే వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిరినాయక్, ఉపాధ్యాయులు వాసేదేవ్, రవీందర్నాయక్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అవసరం మేరకు యూరియా వినియోగించాలి
నెల్లికుదురు: రైతులు అవసరం మేరకే యూరియాను వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సూచాంచారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు ఎరువుల షాపులను ఏఓ షేక్ యాస్మిన్తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, ఈ పాస్ యంత్రాల్లోని స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డీలర్లు ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముగిసిన
సమ్మర్ ఇంటర్న్షిప్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్షిప్నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ‘డయల్ యువర్ డీఎం’