మహబూబాబాద్ అర్బన్: తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలని కుమ్మరికుంట్ల తండా పాఠశాల పూర్వ విద్యార్థులు బానోతు శ్రీను, బానోతు రఘు డిమాండ్ చేశారు. మానుకోట మున్సిపల్ పరిధి 10వ వార్డు కుమ్మరికుంట్ల తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ముందు పూర్వ విద్యార్థులు గురువారం నిరసన చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కుమ్మరికుంట్ల తండా పాఠశాలలో 2018 వరకు సుమారు 60 మంది విద్యార్థులు చదువుకున్నారని, కరోనా సమయంలో విద్యార్థులు రాక మూసివేశారన్నారు. ఇప్పటికై నా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను తెరిచి, గిరిజన విద్యార్థుల చదువుకు తోడ్పడాలన్నారు. పూర్వ విద్యార్థులు బానోతు హరి, నరేశ్, నవీన్, దేవేందర్, సురేశ్, అశోక్, శివ, జోహన్, బాలు తదితరలు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు.
మా వాటా
మాకు దక్కాల్సిందే..
కురవి: రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన సంగం వాటా దక్కాల్సిందేనని జన అధికార సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి రచించిన ఓబీసీ రైసింగ్ పుస్తకాన్ని కురవి వీరభద్రస్వామి ఆలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓబీసీ పోరుబాట పుస్తకంలో పొందుపర్చడం జరిగిందన్నారు. ఓబీసీల పోరుబాట పుస్తకం తొమ్మిది విభాగాలుగా విభజించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి యాకమ్మ, గుర్రపు సత్యనారాయణ, బాణాల వీరయ్య, పింగిలి శ్రీనివాస్, కోట జనార్దన్, రేణిగుంట్ల శ్రీదేవి, మాచర్ల రమేశ్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద అర్బన్: జిల్లా గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన ఆర్సీఓ రత్నకుమారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొనాన్రు. 2024–25 విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు మానుకోట జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీ పాత కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ హాజరుకావాలన్నారు.
బాల కార్మిక వ్యవస్థను
నిర్మూలిద్దాం..
మహబూబాబాద్ రూరల్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థాన ప్రాంగణం నుంచి తొర్రూరు బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం మీదుగా తిరిగి మళ్లీ కోర్టు వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. న్యాయ చైతన్య సదస్సుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మనవంతు కృషి చేయాలని సూచించారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నాగవాణి, జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ చంద్ తదితరులు ఉన్నారు.
బడి తెరవాలని పూర్వ విద్యార్థుల నిరసన
బడి తెరవాలని పూర్వ విద్యార్థుల నిరసన