
ధాన్యం సేకరణ పూర్తి
మహబూబాబాద్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. ఈనెల 9వ తేదీ వరకు 1,76,101 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందుకు రూ.408.47 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.321.20 కోట్లు చెల్లించారు. ప్రతీసారి ఆన్లైన్లో జాప్యంతో చెల్లింపులు నెమ్మదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈసారి వెనువెంటనే ధాన్యం మిల్లులకు తరలింపుపై అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అకాల వర్షాల వల్ల పలు సమస్యలు తలెత్తినా.. వాటిని అధిగమించి కొనుగోళ్లను సజావుగా పూర్తి చేశారు.
1,36,236 ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలో 18 మండలాలు ఉండగా గంగారంలో వరిపంట సాగు చేయలేదు. దీంతో 17 మండలాల్లో 1,36,236 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈమేరకు 1,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే సన్నధాన్యం 1,40,130మెట్రిక్ టన్నులు ,గ్రేడ్ ఏ రకం 32,224 మెట్రిక్ టన్నుల ధాన్యం, కామన్ రకం 3,746 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తంగా 1,76,101 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 35,207 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.408.47 కోట్లు అని అధికారులు తెలిపారు.
ఆన్లైన్లో జాప్యం..
32,216 మంది రైతులకు సంబంధించిన 1,48,412 మెట్రిక్టన్నుల ధాన్యం ఆన్లైన్ అయ్యి ంది. దాని విలువ 344.23 కోట్లు ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా 29,921మంది రైతులకు రూ.321.20 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా 2,295 మంది రైతులకు సంబంధించి రూ.23.02 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే రూ.64 కోట్ల విలువైన ధాన్యం ఆన్లైన్ చేయాల్సి ఉంది. కాగా ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు.
1,76,101 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు
ధాన్యం మొత్తం మిల్లులకు తరలింపు
రూ.408.47 కోట్లకు గానూ..
రూ.321.20కోట్లు చెల్లింపు