
వంట మనిషి ఇంట్లోనే బడి..
కేసముద్రం: ప్రాథమిక పాఠశాలకు సొంతభవనం లేక అద్దె భవనాల్లో నడిపిస్తూ వచ్చారు. చివరకు ఆ తండాలో అద్దెకు భవనం దొరకలేదు. దీంతో గత ఏడాది మధ్యాహ్న భోజనం వండి వడ్డించే వంటమనిషి ఇంట్లో బడిని నడిపించారు. అయితే స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా వంట మనిషి ఇంట్లోనే పాఠశాలను గురువారం పునఃప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారితండాలో 2001లో ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాగా, అప్పటి నుంచి సొంతభవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే బడిని నడిపిస్తూ వచ్చారు. మొదట్లో 60 మంది విద్యార్థులు ఉండగా, ఆ తర్వాత సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది. మూడేళ్ల క్రితం మన ఊరు–మన బడి కింద స్కూల్ భవనం కోసం రూ.28 లక్షల నిధులు మంజూ చేయగా.. పిల్లర్ల వరకే నిర్మాణం చేపట్టారు. తర్వాత పనులు చేపట్టకపోవడంతో అద్దె భవనంలోనే బడిని నడిపిస్తూ వచ్చారు. ఈ మేరకు గత ఏడాది తండాలో అద్దెకు భవనం దొరకలేదు. దీంతో బడిలో మధ్యాహ్నం భోజనం వండే వంట మనిషి వినోద.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తన ఇంట్లో బడిని నడిపించడానికి అంగీకరించింది. ఈఏడాది కూడా స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉండటంతో.. ఆమె ఇంట్లో రేకులషెడ్డుకింద బడిని పునఃప్రారంభించారు. ఇటీవల బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ ఉపాధ్యాయులు ప్రచారం చేస్తుండగా, సొంత భవనంలేని బడికి ఎలా పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, భవన నిర్మాణం పూర్తిచేయాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పాఠశాల