గుండెపోటుతో ఎస్కేయూ విద్యార్థిని మృతి
రాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి.


