సున్నిపెంటకు రాని ఆర్టీసీ బస్సులు!
● ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్న
సున్నిపెంట వాసులు
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు దోర్నాల జంక్షన్ నుంచి సున్నిపెంట మీదుగా శ్రీశైలం రావాలి. అలాగే శ్రీశైలం నుంచి సున్నిపెంట మీదుగా తిరిగి వెళ్లాలి. శ్రీశైలానికి నంద్యాల, కర్నూలు, అనంతపూర్, ఎమ్మిగనూరు, ఒంగోలు, పొదిలి, మార్కాపూర్, వినుకొండ, నరసరావుపేట నుంచి బస్సులు అరకొరగా వస్తున్నాయి. ప్రయాణికులు సున్నిపెంట పోవాలని కోరితే వెంటనే దించుతున్నారు. శ్రీశైలం వెళ్లిన వారు ఏదో ఒక వాహనం ద్వారా సున్నిపెంటకు చేరుకుంటున్నారు. ఇటీవల ఒక ప్రయాణికుడు దోర్నాల బస్సు ఎక్కితే సున్ని పెంటకు వెళ్లదని చెప్పడంతో ఎందుకు వెళ్లదని వాగ్వాదానికి దిగారు. సున్నిపెంటకు వెళ్లి తిరిగి శ్రీశైలం రావడానికి పది కిలోమీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందనే భావనతో పాటు డ్రైవింగ్ భారం కూడా తగ్గుతుందని డ్రైవర్ల ఉద్దేశంగా ఉందని సున్నిపెంటవాసులు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చే డ్రైవర్ ’కం‘కండక్టర్లు కలిసికట్టుగా మాట్లాడుకుని సున్నిపెంటకు బస్సులు వెళ్లకుండా చేస్తున్నారని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్న
సున్నిపెంట వాసులు
వివిధ జిల్లాల డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు సున్నిపెంట నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం చేరుతున్నాయి. శ్రీశైలం నుంచి సున్నిపెంట మీదుగా కాకుండా నేరుగా తిరిగి వెళ్తున్నాయి. దీంతో ఆ గ్రామ ప్రయాణికులు జీపులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సున్నిపెంట నుంచి ప్రతిరోజు శ్రీశైలానికి 500 మంది నుంచి 800 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు, శ్రీశైలంలో ఉన్న హోటల్స్, వివిధ షాపుల్లో పనిచేస్తున్న వారు సున్ని పెంట నుంచి వస్తున్నారు. అయితే బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపుల్లో ప్రయాణం చేస్తున్నారు. రోజుకి రూ.50 రూ. 60 పైగా తమకు వచ్చే కొద్దిపాటి వేతనంలో ఖర్చు చేయాల్సి రావ డం వారికి భారంగా మారింది.


