ఉద్యానశాఖలో నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఉద్యాన శాఖలో 2017–18 నుంచి వివిధ పథకాల కింద చేసిన నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్కు శ్రీకారం చుట్టారు. 2017–18 నుంచి 2024–25 వరకు ఎంఐడీహెచ్, ఆర్కేవీవై తదితర వాటి కింద జిల్లాకు విడుదలైన నిధులు, వాటి వినియోగంపై అకౌంటెంట్ జనరల్(ఏజీ) ఆడిట్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది ఆడిట్ చేపట్టారు. సంవత్సరం వారీగా వివిధ పథకాల కింద కాంపోనెంటు వారీగా నిధులు, ఖర్చులు, వాటికి సంబందించిన బిల్లులు, ఓచర్లు తదితర వాటిని పరిశీలిస్తారు. ఆడిట్కు అవసరమైన రికార్డులు, బిల్లులు, ఓచర్లను జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి ఆద్వర్యంలో సిద్ధం చేశారు. ఆడిట్కు పూర్తిగా సహకరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు
కర్నూలు(సెంట్రల్) : పెన్షన్ల పంపిణీపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో పెన్షన్ పంపిణీపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెన్షన్ల పంపిణీకి కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారని, కొందరు పెన్షన్దారులతో సరిగా మలుచుకోవడంలేదని ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు వారంలో మూడుసార్లు ఎంపీడీఓలు, డీఆర్డీఏ పీడీ వెళ్లి విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఫిర్యాదులు రాకూడదని, వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమపరిధిలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించి భోజనం నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు.
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఉప్పర కాలనీలో శుక్రవారం సాయంత్రం డిగ్రీ విద్యార్థి సంపత్(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..కాలనీకి చెందిన శ్రీనివాసులు, మీనాక్షిలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మీనాక్షి ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సంపత్(19) మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులను సినిమాకు పంపించి ఇంట్లో ఉన్నాడు. తల్లిదండ్రులు సినిమా చూసి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపులు వేసివుండటంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూస్తే ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయటంతో ఇంటి పక్కన వారు వచ్చి సంపత్ను కిందకు దించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వాసుపత్రికి వచ్చేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీలో కూడా అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అయితే తనకు తలనొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సంతప్(19) సూపైడ్ నోట్ను పెన్సిల్తో వ్రాసి జేబులో పెట్టుకున్నాడు. కిందకు దించేటప్పుడు కుటుంబ సభ్యులు ఈ లెటర్ను జేబులో నుంచి బయటకు తీసుకొని చూసి బోరన విలిపించారు. తలనొప్పి ఉందని ఇంత వరకు ఒక్కమాట కూడ మాకు చెప్పలేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాములపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మ కూరుపట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు కర్నూలు జిల్లా హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాములపాడు మండలంలోని భానుముక్కల టర్నింగ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు యువకుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉద్యానశాఖలో నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్
ఉద్యానశాఖలో నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్


