హైకోర్టు చీవాట్లు పెట్టినా మారని ప్రభుత్వం
కర్నూలు(టౌన్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి పార్టీలు విషం చిమ్మినా ఏనాడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ రోజులను మించిపోయిందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మీడియాతో పాటు తాము కూడా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం మత్తులో ఉన్న బైకర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారన్నారు. లక్ష్మీపురం పరిధిలోని బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే విషయంపై తాము మాట్లాడితే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల ఆఫీసులకు పోలీసులు వెళ్లడం, నోటీసులు ఇవ్వడం ఎప్పుడూ చూడలేదన్నారు. సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు, భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడు, లోకేష్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వీటికి ఎంతమాత్రం భయపడబోం. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. ఏడాదిన్నర పాలనలో చీప్ లిక్కర్, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు లేవని ఈ ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం.
– ఎస్వీ మోహన్ రెడ్డి,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు


