
ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది
45 మంది గురువులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
సమాజాభివృద్ధిలో
కర్నూలు(సెంట్రల్): సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని, వారిని గౌరవించే సంప్రదాయం వర్ధిల్లాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురుపూజోత్సవం(జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా గురువులను గౌరవించుకోవాలన్నారు. కేవలం చదువే కాకుండా నైతిక విలువలతో కూడిన జీవనం అలవర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. త్వరలోనే ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కొత్త స్టూడియోను ఏర్పాటు చేస్తామన్నారు. తాను సిల్వర్ జూబ్లీ కాలేజీలో బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని, అయితే మరో ఉద్యోగం రావడంతో కాలేకపోయానన్నారు. బోధనపై ఉన్న ఆసక్తితో బీఈడీ చేసే సమయంలోనే డిగ్రీ విద్యార్థులకు గణితం బోధించాని, డీఎస్సీ విద్యార్థులు కోచింగ్ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
డీఈఓ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించినట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యాలు అలవడుతాయన్నారు. ఉపాధ్యాయులు దైవంతో సమానమని, వారిని గౌరవించడం ఎప్పుడూ ఆనందమేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, 17వ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతీ, రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధారనగర్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లు
ఎంపీ లాడ్స్ నుంచి జిల్లాలోని ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లను ఇస్తాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించా. ఆ తర్వాతే ఎంపీ అయ్యాను.
బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న 45 మంది గురువులను శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించి మెమొంటోతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇందులో 31 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కాగా, 14 మంది జూనియర్ కళాశాలల్లో బోధన చేసే అధ్యాపకులు. కాగా, మరో ఆరుగురు పాఠశాలల పీడీలను స్పోర్ట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుల కింద సన్మానించారు. అంతకముందు శారద నృత్య కళాశాల విద్యార్థులు దివ్యాన్స్, హిమ వర్షిణి నృత్యం ఆకట్టుకోగా కలెక్టర్, ఎంపీ వారిని సన్మానించి మెమొంటోలను అందజేశారు.
ఆహ్వానం పంపినా గైర్హాజరు
జిల్లాలోని కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గురు పూజోత్సవం ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాణ్యం ఎమ్మెల్యే ప్రసంగం చేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక మంత్రి టీజీ భరత్, కోడుమూరు ఎమ్మెలే బొగ్గుల దస్తగిరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్బాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆహ్వానాలు పంపినా హాజరు కాకపోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల తీరు పట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నృత్యం చేస్తున్న విద్యార్థినులు