మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం | - | Sakshi
Sakshi News home page

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

Jul 14 2025 4:55 AM | Updated on Jul 14 2025 4:55 AM

మహిళా

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

కొలిమిగుండ్ల: ఉమ్మడి కృష్ణా జిల్లా బీసీ మహి ళా జెడ్పీచైర్‌పర్సన్‌పై దాడికి దారుణమని, దాడులకు పాల్పడ్డ టీడీపీ, జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి డిమాండ్‌ చేశారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వెళుతున్న ఆమె కారును చుట్టుముట్టి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొలిమిగుండ్లలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్‌ హోదా కలిగిన జెడ్పీచైర్‌పర్సన్‌ వెళుతుంటే అడ్డుకొని దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దుష్ట కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్దేశపూర్వకంగా నిత్యం ప్రజల్లో తిరిగే జెడ్పీచైర్మన్‌లకు గన్‌మెన్‌లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్‌లు ఉన్నారనే అక్కసుతోనే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందన్నారు. తక్షణమే గన్‌మెన్‌లను పునరుద్ధరించాలని కోరారు.

గంగమ్మకు బోనాలు

దొర్నిపాడు: మండల కేంద్రం దొర్నిపాడులో రజకులు ఆదివారం గంగమ్మకు బోణాలు సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం మొక్కుబడిలో భాగంగా రజకులు వివిధ ప్రత్యేక పూజలు చేశారు. వివిధ వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. మహిళలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షం కోసం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారికి పల్లకీ సేవ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

కెరీర్‌ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల నియామకం

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో కెరీర్‌ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లుగా పదిమందిని నియమించినట్లు జిల్లా జీసీడీఓ నాగసువర్చల పేర్కొన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ, ఎంపీయూపీ, ఏపీ మోడల్‌ స్కూల్‌, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, ఏపీఆర్‌ఈఐఎస్‌, ఇతర పాఠశాలల్లో ప్రతి కౌన్సిలర్‌ రెండు నుంచి 3 మండలాల వరకు కనీసం 18 నుంచి 20 పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ సేవలను అందించనున్నట్లు తెలిపారు. మానసిక ఆరోగ్య సేవలు, జీవన నైపుణ్య శిక్షణ, వ్యక్తిగత కౌన్సెలింగ్‌, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమన్వయం వంటి అంశాలు ఉంటాయన్నారు. పరీక్షల భయం, ఒత్తిడి, డిపెష్రన్‌ వంటి సమస్యలకు వ్యక్తిగత కౌన్సెలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే విద్య, ఉద్యోగ అవకాశాలపైన అవగాహన కల్పిస్తారన్నారు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

నంద్యాల: పట్టణంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ట్లు నంద్యాల త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానిక నౌమాన్‌నగర్‌కు చెందిన వేదావతి, రమేష్‌ల కుమార్తె సౌదామిని (17) పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కంబగిరి రాముడు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

ఆలూరు రూరల్‌: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని అగ్రహారం గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. యూపీ రాష్ట్రానికి చెందిన దీషన్‌, మనీష్‌, కమల్‌ అనే కార్మికులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఆటోలో ఆదోనికి వెళ్తున్నారు. అగ్రహారం గ్రామం వద్ద గుంతను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఆ ముగ్గురుకి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు.

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం 1
1/4

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం 2
2/4

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం 3
3/4

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం 4
4/4

మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement