
అనాథ పిల్లల న్యాయ సహాయానికి 15100
కర్నూలు(సెంట్రల్): దిక్కులేని/అనాథ పిల్లలకు న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటప్రసాద్ ప్రజలకు సూచించారు. మంగళవారం న్యాయ సేవా సదన్లో సాథి కమిటీలోని సభ్యులతో స్పెషల్ డ్రైవ్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సాథి కమిటీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలతో 125 మంది అనాథ పిల్లలను గుర్తించామని, వీరందరికీ జూన్ 26 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించి ఆధార్ కార్డులు ఇచ్చేలా చూడాలని సూచించారు. ఆధార్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీడీఎస్ పీడీలు నిర్మల, లీలావతి, నంద్యాల డీఎంహెచ్ఓ శారదబాయి, ప్యానల్ లాయర్ వెంకటేశ్వర్లు, పారా లీగల్ వలంటీర్లు రాయపాటి శ్రీనివాస్, సుధారాణి, హేమంత్ పాల్గొన్నారు.
గురుకుల ఇంటర్మీడియెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు
కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి డాక్టర్ అంబేద్కర్ గురుకులాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు చేసినట్లు జిల్లా కన్వీనర్ డాక్టర్ ఐ.శ్రీదేవి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్కు పిలుస్తున్నందున సీటు రావడం కచ్చితమని భావించకూడదన్నారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు బీసీ–సి, ఎస్సీ కేటగిరీలకు చెందిన అమ్మాయిలకు, 28వ తేదీన బీసీ, ఓసీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అమ్మాయిలకు దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 27వ తేదీన బీసీ–సి, ఎస్సీ కేటగిరీలకు చెందిన అబ్బాయిలకు, 29వ తేదీన బీసీ, ఓసీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అబ్బాయిలకు చిన్నటేకూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కేవలం ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు స్వయంగా ఆహారం, నీరు, ఇతర అవసరమైన సామగ్రి తెచ్చుకోవాలని, ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించబడవన్నారు.
గ్రామాభివృద్ధిలో మహిళా సర్పంచులు కీలకం
కర్నూలు(అర్బన్): గ్రామాల అభివృద్ధిలో మహిళా సర్పంచులు కీలక పాత్ర పోషించాలని డీపీఆర్సీ ప్రిన్సిపాల్, జెడ్పీ సీఈఓ జీ.నాసరరెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో మూడు రోజుల పాటు జరగనున్న మహిళా సర్పంచుల శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామ స్వరాజ్య అభియాన్ – ఆర్జీఎస్ఏ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ నాసరరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పోషణ, అభివృద్ధి విషయంలో మహిళలు పోషిస్తున్న పాత్రనే గ్రామాభివృద్ధిలోనూ నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్య, స్వచ్ఛమైన తాగునీరు, గ్రామ పంచాయతీ ఆస్తుల రక్షణ తదితర వాటిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులతో గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే పంచాయతీరాజ్ చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీ, డిప్యూటీ ఎంపీడీఓలు నాగేష్, శ్రీహరి, రవి, కిషోర్, సందీప్, పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్కుమార్, రాముడు తదితరులు పాల్గొన్నారు.

అనాథ పిల్లల న్యాయ సహాయానికి 15100