
రాఘవుడి దర్శనానికి దారేది?
● సింగిల్ ఎంట్రెన్స్తో భక్తుల నిరీక్షణ ● తోపులాటలతో ఉక్కిరి బిక్కిరి.!
మంత్రాలయం : శ్రీమఠం అధికారుల తీరు భక్తుల తోపులాటకు దారి తీసింది. సింగిల్ ఎంట్రన్స్తో భక్తులకు ముచ్చెమటలు తెప్పించింది. వృద్ధులు, చిన్నారులను కన్నీళ్లు పెట్టించింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. గురు, శని, ఆదివారాలు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీమఠం అధికారులు ఏర్పాట్లు చేయడంలో కాస్త అలసత్వం కనబడుతోంది. మొన్నటి వరకు శ్రీమఠం ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే చుట్టూరా మూడు ప్రధాన ద్వారాలతోపాటు, ప్రధాన ద్వారం ఇరువైపులా చిన్న ద్వారాలు నుంచి అవకాశం కల్పించేవారు. ద్వారాలతో రద్దీ తక్కువగానే ఉన్న క్యూలైన్లలో భక్తుల బారులు తీరే పరిస్థితి. క్యూలైన్లు పెంచాల్సి వస్తుందేమోనని.. లేక ప్రాంణగంలో రద్దీ తగ్గించాలనో.. కొత్త పద్ధతిని ఆచరణలోకి తెచ్చారు. ఆదివారం దర్శనాలకు వచ్చిన భక్తులను కేవలం ప్రధాన ద్వారం నుంచి ప్రవేశం కల్పించారు. పోలీసులు, సెక్యురిటీగార్డులతో రోప్ ఏర్పాటు చేసి భక్తులకు బ్రేకులు వేస్తూ వచ్చారు. అయితే రోప్తో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. శ్రీమఠంలోకి వచ్చేందుకు తోసుకుంటూ ఎగబడ్డారు. తోపులాటతో వృద్ధులు, చిన్నారులు కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. లక్షలాది మంది భక్తులకు ఒకే ఎంట్రెన్స్ పెట్టడంతోనే ఇబ్బందులు తలెత్తాయి. ఇన్నాళ్లూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఆయా ద్వారాల నుంచి సాఫీగా మఠంలోకి వెళ్లి వచ్చే పరిస్థితి. ఈ అనాలోచనతో దర్శనాలకు బాగానే సమయం పట్టింది. కూలైన్లతో భక్తులకు ఎలాంటి వసతు లు కూడా లేకపోవడంతో తలలు పట్టుకున్నారు. కనీసం క్యూలైన్లతో తాగునీటి సౌకర్యమైనా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇక అన్నపూర్ణ భోజనశాలలోనూ అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలోనే కూర్చుండిపోయారు. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే రాఘవేంద్రుల ఆరాధనోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని భక్తులు వాపోయారు.

రాఘవుడి దర్శనానికి దారేది?