
జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● ఏడాది పాలనలో ప్రజలకు చేసింది
ఏమీ లేదు
● ‘సూపర్ సిక్స్’ అంటూ వంచన చేశారు
● మేనిఫెస్టో అమలు చేయలేదు
● జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి
● విడతల వారీగా ‘బాబూ ష్యూరిటీ..
మోసం గ్యారెంటీ’ కార్యక్రమం
● వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి
సమావేశంలో మాజీ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తీవ్ర ఇబ్బందుల్లో రైతులు
● జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు.
● పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడదామని పిలుపునిచ్చారు. ఐదేళ్ల జగనన్న పాలనలో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అదే జగనన్న ఉంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందేవని భావిస్తున్నారన్నారు.
కర్నూలు(టౌన్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసాలకు చిరునామా మారారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి విమర్శించారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ అని మాటఇచ్చి నేడు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’గా మారారన్నారు. కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరీటీ– మోసం గ్యారెంటీ’ పేరుతో క్యూఆర్ కోడ్ అవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ఏదీ?
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని తేలిపోయిందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి పేదలు, మహిళలు మోసపోయామని అర్థమైందన్నారు. జగనన్న హయాంలో ఏటా రూ. 70 వేల కోట్లు ప్రతి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, మహిళలకు నేరుగా వారి అకౌంట్లలో జమ చేశారని గుర్తు చేశారు. ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికీ అమలులోకి రాలేదని విమర్శించారు.
ఇంటింటికీ మోసం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇంటింటికీ మోసం చేశారన్నారు. మోసాలను గ్రామా గ్రామానా వివరిద్దామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రూ. 4 వేలు పెన్షన్, నిరుద్యోగులకు రూ. 3 వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామ స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. బాబు ష్యూరీటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ మోసాలను వివరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో ఇంటింటికి రూ.2.40 లక్షల లబ్ధి పొందుతారని చెప్పి దగా చేశారని విమర్శించారు.
హాజరైన ఎమ్మెల్యేలు
సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, హఫీజ్ఖాన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, గడ్డం రామక్రిష్ణారెడ్డి, రుద్రగౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, షరీఫ్, అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కల్లా నాగవేణి రెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, మంగమ్మ, భారతి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టా ప్రతుల్, కార్పొరేటర్లు షేక్ యూనిస్ బాషా, సిట్రా సత్యనారాయణమ్మ, షేక్ ఆర్షియా ఫర్హీన్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
జమిలీ ఎన్నికలు 2027 సంవత్సరంలో వస్తున్నాయని, పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసి జగనన్నను గెలిపించుకుందామని మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏడాది పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ‘సూపర్ సిక్స్’ అంటూ ప్రజలను వంచన చేశారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఆశలు కల్పించి దగా చేశారని విమర్శించారు. అరకొరగా తల్లికి వందనం నిధులు వేసి ఎవరైనా ఈ పథకం గురించి మాట్లాడితే నాలుక మడత పెడతామంటూ బెదిరించడం ముఖ్యమంత్రి స్థాయిలో తగదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోబోరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చేసిన మోసాలను జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు ఎలాంటి లబ్ధిని చేకూర్చిందో తెలియజేయాలన్నారు.

జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి