
ఒకటి మంత్రికి.. రెండోది ఎమ్మెల్యేకు!
కర్నూలు(సెంట్రల్): సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు పాతరేసి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్న వారికి అనువైన స్థానాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆ స్థానాలను కోరుకుంటే వాటిలో మంత్రి చెప్పిన వ్యక్తి ఉన్నారని, ఎమ్మెల్యే సూచించిన వారికి ఇవ్వాల్సి ఉందని, మరో స్థానం కోరుకోవాలని నేరుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం చేపట్టిన వీఆర్వోలు, సర్వేయర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదంతా అధికారుల తీరుతోనే జరుగుతోందని, ఇందులో కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడంతోనే జరుగుతోందని చెబుతున్నారు.
అధికారుల తీరుపై సర్వేరయర్ల ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు, నంద్యాల డీఆర్వోలు సి.వెంకటనారాయణమ్మ, రామునాయక్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల సర్వే ఏడీలు మునికన్నన్, జయరాముడు ఆధ్వర్యంలో సర్వేయర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ముందుగా స్పౌజ్, అరోగ్యం, ఒంటరి మహిళ, మ్యూట్వువల్ విభాగాల్లో ర్యాంకుల ఆధారంగా వీఆర్వోలు, సర్వేయర్లను కౌన్సెలింగ్ పిలిచారు. వచ్చిన వారిలో ర్యాంకుల ఆధారంగా పిలిచి...మూడు ఆప్షన్లు ఇచ్చిన అధికారులు.. ‘మూడింటిలో ఒక స్థానం మంత్రి సిఫారసు ఉంది.. మరొక స్థానం ఎమ్మెల్యే మనిషికి ఇవ్వాలి.. ఇంకో స్థానం కోరుకో’ అని చెబుతుండడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖల పేరిట ఫోకల్ స్థానాలను రిజర్వ్ చేసినట్లు చేయడం అన్యాయమని వాపోయారు. సిఫార్సు అంటే ఒకటో..రెండో ఉండాలి తప్ప.. ఎక్కువ స్థానాలను వారికే కేటాయించేలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు లేని వారికి నాన్ఫోకల్ పోస్టులను ఇస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. ఎవరికీ కావాల్సిన స్థానాలు వారికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి వరకు..
సర్వేయర్లలో బదిలీల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 800 మందిలో 294 మందికి ఐదేళ్ల సర్వీ సు పూర్తి కాగా...మిగిలిన వారు రిక్వెస్టు జాబితాలో దరఖాస్తు చేసుకున్నారు.అలాగే వీఆర్వోల్లో గ్రేడు–2లో మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకొగా ఇద్దరు హాజరు కాలేదు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తైన వారు 30మంది ఉన్నారు. గ్రేడు–1 వీఆర్వోలో 14 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అయితే సర్వేయర్లు భారీ సంఖ్యలో ఉండడంతో రాత్రి వరకు కొనసాగింది. కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిఫార్సు లేఖల నేపథ్యంలో సర్వేయర్లు కౌన్సెలింగ్ను బహిష్కరించారు. దీంతో అధికారులు వారికి సర్దిచెప్పి నిబంధనలకు మేరకు ఖాళీలను చూపుతామని చెప్పి అర్ధరాత్రి వరకు కొనసాగించారు.
ముగిసిన కౌన్సెలింగ్
కర్నూలు (టౌన్): ఉమ్మడి జిల్లాకు సంబంధించి సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్లానింగ్ కార్యదర్శులు 155 మంది, ఎమినీటీస్ కార్యదర్శులు 170 మందికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
మూడు ఆప్షన్లు ఇచ్చి వీఆర్వో,
సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్
లేఖలు లేని వారిని దూర ప్రాంతాలకు
బదిలీ చేసిన అధికారులు
అర్ధరాత్రి వరకు కొనసాగిన
సర్వేయర్ల బదిలీల ప్రక్రియ