
కొండల్ని కొల్లగొట్టి.. ఎర్రమట్టి దోపిడీ
ఎమ్మిగనూరురూరల్: కొండల్లో ఎర్రమట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మిగనూరు మండలంలోని మాచుమాన్దొడ్డి, నవోదయ పాఠశాల ఎదురుగా, బనవాసి ఫారెస్ట్, ఎస్.నాగాలపురం, హనుమాపురం, వెంకటగిరి గ్రామ కొండల్లో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. బనవాసి ఫారంలో చాలా చోట్ల గోతులు తవ్వి మట్టిని తరలించారు. కొన్ని చోట్ల ప్రొక్లెయిన్లు ఉపయోగిస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే అటవీ సంపదను తరలిపోతుంది.
అక్రమార్కులకు ఆర్థిక వనరుగా..
కొండలకే పరమితమైన తవ్వకాలు ఇప్పుడు నేరుగా బనవాసి ఫారంలో టేకు చెట్లు పెంచుతున్న వనంలోకి వచ్చాయి. టేకు చెట్లు అడుగు వరకు ఉన్న మట్టిని తీస్తున్నారు. చెట్ల నరికివేసి వాటిని కూడా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కళకళాడిన బనవాసి ఫారం నేడు అక్రమార్కులకు ఆర్థిక వనరుగా మారిపోయింది. గతంలో ఇక్కడ పనిచేసి వలంటీర్లు ఇప్పుడు లేకపోవటంతో కాంట్రాక్టర్లు టాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు
అటవీకి ప్రాంతంలో యఽథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తూ చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అటవీశాఖ అధికారులు ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో ఉండటంతో పర్యవేక్షణ లోపించింది. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు బరితెగించారు. బనవాసి ఫారెస్ట్ పరమాన్దొడ్డికి వెళ్లే దారి సమీపంలోని స్మార్ట్ సిటీ దగ్గర ఎర్ర చందనం చెట్లను నరికివేశారు. ఎవరు గుర్తించకపోతే వాటని రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. ఎర్ర చందనం చెట్లు నరికివేతకు గురైనా ఫారం అధికారులకు కనిపించకపోటం గమనార్హం.
కఠిన చర్యలు తీసుకుంటాం
అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫారంలో ఇంతకు ముందే మట్టిని తరలించరాదని చెప్పాం. తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఇస్తే పట్టుకుంటాం. కాంట్రాక్టర్లు తరలిస్తే కేసులు నమోదు చేస్తాం.
– శ్రీనివాసులు, రూరల్ ఎస్ఐ

కొండల్ని కొల్లగొట్టి.. ఎర్రమట్టి దోపిడీ