
దిక్కుతోచని వేరుశనగ రైతు
● సీజన్ మొదలైనా ముందుకు సాగని పంపిణీ ● నామమాత్రం కేటాయింపులతో వ్యవసాయ అధికారుల్లో ఆందోళన ● ప్రతి మండలం నుంచి అదనపు కోటాకు డిమాండ్ ● ఉమ్మడి జిల్లాలో వేరుశనగ 66,653 హెక్టార్లు సాగయ్యే అవకాశం ● విత్తన కేటాయింపు కేవలం 14వేల హెక్టార్లకే..
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు కురుస్తున్నా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు రైతులకు అందడం లేదు. దీంతో పొలాలను బీళ్లుగా వదిలేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు బదిలీల ప్రక్రియలో నిమగ్నం కావడంతో వేరుశనగ పంపిణీ ఊపందుకోలేదు. బదిలీలు కొలిక్కి రావడంతో ఇప్పుడిప్పుడే ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఏఓలు కేటాయింపులను చూసి పంపిణీ ఎలా చేయాలని తల పట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్లో 54,710, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల ప్రకారం వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధానంగా కే–6 రకం సాగు చేస్తారు. హెక్టారుకు 170 కిలోల విత్తన కాయలు అవసరం. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాకు 1.13 లక్షల క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుంది. అయితే వ్యవసాయ యంత్రాంగం ఉమ్మడి జిల్లాకు 32,181 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అడిగినంత ఇవ్వలేకపోయినా కనీసం గత ఏడాది పంపిణీని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకారం కేటాయించాలి. గత ఏడాది కర్నూలు జిల్లాలో 13,909 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 3,062 క్వింటాళ్ల ప్రకారం 16,971 క్వింటాళ్లు పంపిణీ అయింది. ఈ ప్రకారం కూడా కేటాయింపులు లేకపోవడం గమనార్హం.
హెక్టారుకు 1.50 క్వింటాళ్ల ప్రకారం..
అర్ధ ఎకరాకు 30 కిలోల ప్యాకెట్ ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్లు, అంటే 1.50 క్వింటాళ్ల వేరుశనగ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రకారం జిల్లాకు 99,979 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుంది. ఉమ్మడి జిల్లాకు కేటాయించింది 11,108 క్వింటాళ్లు మాత్రమే. ఇది కేవలం 14వేల హెక్టార్లకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన వేరుశనగను రైతులు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధ్వానంగా వేరుశనగ కేటాయించడం పట్ల వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ పంపిణీ మొదలు పెడితే రైతుల నుంచి ఏ స్థాయిలో ఇబ్బందులు వస్తాయోనన్న భయం వ్యవసాయ అధికారులను వెంటాడుతోంది. జిల్లాలో 26 మండలాలు ఉండగా.. ప్రతి ఏఓ అదనంగా వేరుశనగ ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారిని కోరుతున్నారు. గత ఏడాది పత్తికొండ మండలంలో 1,310.40 క్వింటాళ్లు, మద్దికెర మండలంలో 851.10 క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఈసారి మాత్రం పత్తికొండ మండలానికి 650, మద్దికెర మండలానికి 490 క్వింటాళ్లు కేటాయించారు. కేటాయించిన వేరుశనగ ఏ మాత్రం సరిపోదని, కనీసం రెట్టింపు చేయాలని ఆయా మండల వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.
ఆదోని మండలానికి అదనపు
కేటాయింపు
మిగిలిన అన్ని మండలాల నుంచి అదనపు వేరుశనగ కావాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి. అలాంటిది ఒక్క ఆదోని మండలానికి మాత్రమే రాజకీయ నాయకుల ఒత్తిడితో అదనంగా 300 క్వింటాళ్లు కేటాయించారు. తక్కిన మండలాల ప్రజాప్రతినిధులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం రైతులకు శాపంగా మారుతోంది.
బయటి మార్కెట్లో క్వింటా రూ.8వేల పైనే
మాకు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ సారి వేరుశనగ సాగు చేయాలని మే నెల మూడవ వారంలోనే భూములను సిద్ధం చేసుకున్నాం. గతంలో మాదిరి మే నెల 20 నుంచే వేరుశనగ పంపిణీ చేస్తారనుకున్నాం. అయితే జూన్ నెల మొదటి వారం వరకు విత్తన పంపిణీ ఊసేలేకుండా పోయింది. బహిరంగ మార్కెట్లో కొందామంటే క్వింటా ధర రూ.8వేలకు పైగానే ఉంది. అంత డబ్బులు పెట్టలేక ఉద్యాన పంట సాగు చేస్తున్నా.
– మల్లికార్జున, పందికోన గ్రామం, పత్తికొండ మండలం