సాగులో తోడై.. మట్టిలో మాయమై! | - | Sakshi
Sakshi News home page

సాగులో తోడై.. మట్టిలో మాయమై!

Jun 14 2025 7:41 AM | Updated on Jun 14 2025 7:41 AM

సాగుల

సాగులో తోడై.. మట్టిలో మాయమై!

పొలం పనుల్లో విద్యుత్‌ ప్రమాదం
● కాడెద్దు అక్కడికక్కడే మృతి ● ఓ రైతు, మరో కాడెద్దుకు గాయాలు

కోడుమూరు రూరల్‌: ఏరువాక గడిచి వారమైనా కాలేదు. ఎద్దుల సంబరం కళ్లలోనే ఉంది. పిలిస్తే పలికే నేస్తం కళ్లెదుటే కాలమైంది. తోబుట్టువుగా మెలిగి.. సాగులో భాగమైన మూగజీవం ఆ మట్టిలోనే మాయమైంది. పొలం పనులు చేస్తుండగా చోటు చేసుకున్న విద్యుత్‌ ప్రమాదం ఓ కాడెద్దును బలిగొంది. ఈ ఘటన కోడుమూరు మండలం కొత్తపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తపల్లెకు చెందిన కంచి భాస్కర్‌కు ఐదెకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం గోరంట్ల జాతరలో రూ.లక్ష పెట్టి కోడెదూడలను కొనుగోలు చేశాడు. వీటిని ఆ కుటుంబం ఎంతో అపురూపంగా చూసుకుంటోంది. వీరి పొలం పనులతో పాటు గ్రామంలో ఇతర రైతులు పిలిచినా కాడెద్దులను కూలీకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతు మేకలగిడ్డయ్య పత్తి పంట సాగు చేయగా.. శుక్రవారం పత్తిలో కలుపు పాసేందుకు భాస్కర్‌కు చెందిన కాడెద్దులను మాట్లాడుకున్నాడు. అతని కుమారుడు రవి కాడెద్దులతో పత్తి పొలంలో గొర్రు తోలుతుండగా బోరు కనెక్షన్‌కు ఇచ్చిన కరెంటు వైర్ల సపోర్టు కట్టె తగిలింది. కాడెద్దుల తాకిడికి కట్టె విరిగిపోయి విద్యుత్‌ తీగలు వాటిపై తెగిపడ్డాయి. రవికి కూడా స్వల్పంగా విద్యుత్‌షాక్‌ తగలడంతో వెంటనే అప్రమత్తమై ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ సరఫరా నిలిపేయాలని కేకలు వేయడంతో సమీపంలోని రైతులు స్పందించారు. అప్పటికే ఓ ఎద్దు మృతి చెందగా, మరో ఎద్దుకు విద్యుత్‌ షాక్‌కు గురైంది. స్వల్ప గాయాలైన రవిని కోడుమూరులోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. గాయపడిన ఎద్దును పశువైద్య శాలకు తీసుకెళ్లగా సత్వర వైద్యంతో కళ్లు తెరిచింది. అయితే కళ్లెదుటే ఓ ఎద్దు మృత్యువాత పడటాన్ని ఆ రైతు కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న రైతులను కూడా కంటతడి పెట్టించింది.

రూ.లక్షన్నరకు అడిగినా ఇవ్వలేదు

కాడెద్దులంటే మాకు ప్రాణం. మూడేళ్ల కాలంలో ఏనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మా పొలం పనులతో పాటు ఊర్లో రైతులు పిలిస్తే కూలీకి తీసుకెళ్తుంటాం. చిన్న పిల్లల్లానే వీటిని కూడా చూసుకుంటాం. వారం రోజుల కింద రూ.లక్షన్నరకు అమ్మాలని అడిగినా ఆ ఉద్దేశమే లేదని చెప్పాం. ఈ రోజు కళ్ల ముందరే ఓ ఎద్దు ప్రాణం వదిలింది. మా కుటుంబంలో భాగమైన ఓ ఎద్దు మమ్మల్ని వదిలిపోవడం చాలా బాధ కలిగిస్తోంది.

– భాస్కర్‌ కుమారుడు రవి ఆవేదన

సాగులో తోడై.. మట్టిలో మాయమై! 1
1/1

సాగులో తోడై.. మట్టిలో మాయమై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement