
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు
● ఉద్దేశపూర్వకంగా వాహనాల స్వాధీనం ● 25 రోజులైనా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ● మైనింగ్ అధికారులపై జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం ● హంద్రీ–నీవా పనులపై అసహనం ● హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): ‘ ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు .. అక్రమ మైనింగ్ జరు గుతుంటే కేసులు నమోదు చేయండి, కానీ ... రాజకీ య ఒత్తిళ్లతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో శుక్రవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్పై జరిగిన చర్చలో చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ... బెలుం శింగవరం గ్రామ శివారుల్లో గత నెల 20న మైనింగ్ అధికారులు స్థానిక పోలీసుల తో కలిసి దాడులు నిర్వహించి, గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత పేరం రాంశంకర్రెడ్డికి చెందిన ప్రొక్లెయినర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇతరులకు చెందిన గని వద్ద నిలిచి ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం, నోటీసు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
పల్లెల్లో బెల్ట్ షాపులతో అనేక అనర్థాలు ...
గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపులతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కంటితుడుపు చర్యగా కాకుండా ఎకై ్సజ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారాన్ని కూడా తీసుకొని గ్రామాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిర్మూలించాలన్నారు. ఎక్కడబడితే అక్కడ మద్యం లభిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జరిమానాలను విధించడంతో పాటు స్లైడ్ల రూపంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
అభాసుపాలైన విద్యా శాఖ
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యా శాఖ పూర్తి స్థాయిలో అభాసుపాలైందని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అనేక మందికి రీవ్యాల్యూయేషన్, రీకౌంటింగ్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫెయిల్ అయిన, మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు? దరఖాస్తు చేసుకున్న వారిలో మంది ఉత్తీర్ణులయ్యారు? ఎంత మందికి మార్కులు పెరిగాయనే అంశాలపై పూర్తి సమాచారాన్ని వచ్చే సమావేశాల నాటికి అందించాలని ఆయన విద్యాశాఖ అధికారులను కోరారు.
బిల్లులను వెంటనే పంపించండి
వేసవిని దృష్టిలో ఉంచుకొని జెడ్పీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వారంలోగా పంపించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆదేశించారు. ఇయర్ మార్క్డ్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పరిధిలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా జూలై నాటికి పంపించాలన్నారు. ఇంకా ఈ పనులు 129 పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోందని, వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జెడ్పీ ప్రాంగణంలోని చైర్మన్ బంగ్లా నిర్మాణానికి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి రూ.1.25 కోట్లను డిపాజిట్ చేసిన వెంటనే టెండర్లను పిలిచి పీఆర్ ఆధ్వర్యంలో బంగ్లాను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ చెప్పారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
హంద్రీనీవా పనులపై అసహనం
జిల్లాలో 88 నుంచి 216వ కిలోమీటర్ వరకు జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వైడనింగ్, లైనింగ్ పనులపై జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అస హనం వ్యక్తం చేశారు. దాదాపు రూ.439 కోట్లతో ఈ పనులను చేపడుతున్నారని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకే పత్తికొండ మండలం పందికోన సమీపంలో (108.1 కిలోమీటర్ ) కాలువ లైనింగ్ దెబ్బతినడం చూస్తే ఈ పనులను ఎంతమేరకు నాణ్యతతో చేపట్టారో అర్థమవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సెల్ఫోన్లో దెబ్బతిన్న లైనింగ్ పనుల ఫొటోలను చూపించారు. జిల్లాలోని వివిధ కెనాల్స్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో మట్టిని తరలిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని బోర్డులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు