
టీడీపీ నాయకులూ.. మదర్సాలనూ వదలరా!
● మంత్రి అనుచరుల మంటూ బెదిరింపులా? ● కర్నూలులో ముస్లింల ఆందోళన
కర్నూలు (టౌన్): ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు, అనుచరులు వక్స్ బోర్డు స్థలాలను కబ్జా చేస్తున్నారని, మదర్సాల స్థలాన్ని సైతం వదలరా’ అంటూ ముస్లింలు కర్నూలు నగరంలో ఆందోళన నిర్వహించారు. కర్నూలులో ఉన్న ఒకరిద్దరు మంత్రి దగ్గర ఉంటున్నారని, రాత్రికి రాత్రి మదర్సా స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. స్థలంలో అడుగు పెట్టకూడదంటూ బెదిరింపులు చేస్తున్నారన్నారు. శుక్రవారం మసీదులో ప్రార్థనల అనంతరం కర్నూలు ప్రకాష్నగర్లోని రోజా వీధిలో మదర్సా వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున్న ధర్నా చేశారు. ఈ సందర్బంగా అఫ్సర్ బాషా, సయ్యద్ ఇస్మాయిల్ పీరాలు మాట్లాడుతూ.. రోజా వీధిలో ఉన్న మదర్సా స్థలం కొనుగోలు చేశామన్నారు. ఈ స్థలం వక్ఫ్బోర్డుకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రిజిస్ట్రర్ డాక్యుమెంటు 1432 అని 16 సెంట్లలో ఈ మదరసా ఉందన్నారు. ఇప్పుడు మదర్సా స్థలం రూ. 4 కోట్లు విలువ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీకి చెందిన సూరి మన్సూర్ ఆలీఖాన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రి ఈ మదర్సాను స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు. ఎవరూ అడుగు పెట్టకూడదని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఉన్న మదర్సాను నిర్వీర్యం చేయడమే కాకుండా వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. మదర్సాను తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని మసీదుల నుంచి ముస్లింలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.