
వైభవంగా తిరుచ్చి ఉత్సవం
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, నైవేద్య సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితుడు జ్వాలా చక్రవర్తి ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఊరేగింపు నిర్వహించారు.
జీడీపీలోకి వరద నీరు
గోనెగండ్ల: మండలంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే గాజులదిన్నె ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ అలి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండగా, శుక్రవారం 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందని ప్రాజెక్టు ఏఈ వెల్లడించారు. గాజులదిన్నె ప్రాజెక్ట్కు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు.
బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): తల్లికి వందనం నిధులు విడుదల కాని ఎస్సీ విద్యార్థులు పోస్టల్/బ్యాంకు ఖతాలకు ఎన్పీసీఐ లింకు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమం సాధికారత అధికారిణి కె.తులసీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 930 మంది తల్లుల ఎన్పీసీఐ మ్యాపింగ్ పెండింగ్లో ఉందన్నారు. అలాగే 2,129 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఎన్పీసీఐ కూడా పెండింగ్లో ఉందన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగిల్ బ్యాంకు అకౌంట్ మాత్రమే ఉండాలని, అది కూడా విద్యార్థి ఆధార్ లింకు ఉన్న బ్యాంకు అకౌంట్కే తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తి చేయాలన్నారు.

వైభవంగా తిరుచ్చి ఉత్సవం