
నేడు ఆఫ్లైన్లో నీట్ పరీక్ష
కర్నూలు(సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించనున్న జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 4,466 మంది, నంద్యాల జిల్లాలో 1,172 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు సమయానికి బస్సులు, ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ట్రిపుల్ఐటీడీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు కనీసం రెండు గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
వస్త్రధారణపై ఆంక్షలు
● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ కఠినమైన ఆంక్షలు విధించింది. విద్యార్థినులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులతో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించరాదు.
● చేతికి స్మార్ట్, సాధారణ వాచీలను సైతం ధరించరాదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను ఏర్పాటు చేశారు.
● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎలాంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాలుగు బస్సులు
జగన్నాథగట్టులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు కర్నూలు కొత్త బస్టాండ్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఉదయం 10.30, 11.15, 11.45, 12.15 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
కర్నూలు: నీట్ యూజీ 2025 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. జిల్లా కేంద్రంలోని 16 పరీక్షా కేంద్రాల వద్ద ఆదివారం నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు 210 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒక సీఐ లేదా ఎస్ఐ స్థాయి పోలీసు అధికారిని నియమించారు. ట్రాఫిక్ వల్ల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు