
అనాథలకు గుర్తింపు కోసం ‘సాథి’
కర్నూలు(సెంట్రల్): సమాజంలోని అనాథలకు చట్టపరమైన గుర్తింపు కోసం తగిన చర్యలు తీసుకోవాలని లీగల్ సర్వీసు అథారిటీ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. బుధవారం కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్లో.. అనాథలను గుర్తించడంపై పలు లైవ్ డిపార్టుమెంట్లకు చెందిన అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 మే 13న జాతీయ న్యాయసేవల అథారిటీ సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇంక్లూజన్ (ఎస్ఏఏటీహెచ్ఐ–సాథి)ను ప్రారంభించిందని చెప్పారు. అనాఽథలను గుర్తించి ఆధార్ నమోదు చేయడం, చట్టపరమైన సహాయం, సంక్షేమ పథకాలను అందించడం సాథి ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ క్రమంలో అనాథలకు సాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థఽ కార్యదర్శి చైర్మన్గా జిల్లా స్థాయి సాథి కమిటీని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కమిటీ అనాథలను గుర్తించి ఆధార్ ఎన్రోల్ చేయించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అనాథ పిల్లలు కనిపిస్తే 15100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి చెప్పాలని కోరారు. డీఎంహెచ్ఓలు శాంతికళ, వెంకటరమణ, డీఆర్వో కార్యాలయ సూపరింటెండెంట్ రాజేశ్వరి, డీసీపీఓ శారద, నంద్యాల డీఈఓ జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.