
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి
కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలం దర్శనానంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పురుషులు, సీ్త్రల విభాగాల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వారి ఆరోగ్య విషయాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి, జిల్లా అధ్యక్షులు వీరన్న ఉన్నారు.