
పెద్దపులి మృతిపై దర్యాప్తు ప్రారంభం
కొత్తపల్లి: మండలంలోని నల్లమల అడవిలో దేవరసెల ప్రాంతంలో పెద్దపులి మృతి ఘటనపై ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్(కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) కృష్ణమూర్తి శుక్రవారం దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపులి మృతి చెందిన దేవరసెల ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో కలియతిరిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపులిది సహజ మరణమా, మరేదైనా కారణమా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మృతిచెందిన పులి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించామన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. 2004లో ఈ ప్రాంతంలోనే ఓ పులి ఉచ్చులకు చిక్కుకొని గాయపడగా చికిత్స అందించి అటవీ ప్రాంతంలోనే వదిలేశామన్నారు. అదే పులి ఏమైనా అనారోగ్యంతో మృతి చెందిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. కాగా అటవీ అధికారులను కూడా మందలించినట్లు తెలిసింది. ప్రొటెక్షన్ వాచర్లను విధులకు పంపి కార్యాలయాలకే పరిమితమవుతుండటంతోనే పులులు, వన్యప్రాణులకు రక్షణ కరవైందని, మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. కార్యక్రమంలో డీఎఫ్ఓ సాయిబాబా, ఎఫ్ఆర్ఓ పట్టాభి, ఎఫ్ఎస్ఓ కావేరి, అటవీ శాఖ వైద్యులు ఉన్నారు.
సారా తయారీ మానుకోకుంటే పీడీ యాక్ట్
కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని, మానుకోకపోతే పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్లూరు మండలం ఓబులాపురం తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సారా బట్టీలను ధ్వంసం చేసి దాదాపు 1600 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల నాటుసారాను నేలపాలు చేశారు. గ్రామంలో సారా తయారీదారులతో సమావేశం నిర్వహించి ఇకపై సారా విక్రయాలకు స్వస్తి పలుకుతామని ప్రమాణం చేయించారు. పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. సారా బట్టీలు ఎవరు నడుపుతున్నారనేది దర్యాప్తులో తేలితే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముళ్ల కంపల మధ్యలో ప్లాస్టిక్ బిందెల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను కూడా పారబోసి తయారీదారులను హెచ్చరించారు.

పెద్దపులి మృతిపై దర్యాప్తు ప్రారంభం