
తెలుగుగంగ ప్రాజెక్టుకు పాలకుల తూట్లు
● తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి
రుద్రవరం: తెలుగుగంగ ప్రాజెక్టుకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు పనులతో పాటు రుద్రవరం, చాగలమర్రి మండలాల్లోని చెరువుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో శుక్రవారం సమితి సభ్యులు, వివిధ గ్రామాల రైతులతో కలిసి ఆయన రుద్రవరం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ నాలుగు శతాబ్దాలు గడుస్తున్నా తెలుగుగంగ ప్రాజెక్టు అసంపూర్తిగానే ఉందన్నారు. కీలకమైన నిర్మాణాలు చేపట్టడంలోనూ విధానాలు అమలు చేయడంలోనూ పాలకులు విఫలమయ్యారన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వద్ద నేటికీ బైపాస్ కెనాల్ నిర్మాణం చేపట్టక పోవడంతో పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదని, ప్రధాన కాల్వ పనులు పూర్తి చేపట్టకపోవడంతో బ్రహ్మసాగర్కు నీరు చేరడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదని, డబ్బంతా అక్కడ ఖర్చు చేసి రాయలసీమను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. 90 లక్షల ఎకరాలకు సరిపడా నీటిని శ్రీశైలం నుంచి సముద్రంలోకి పారబోసి, చివరగా పంటలు ఎండుతుంటే సాగు నీరు అందించలేక నోరెళ్లబెడుతున్నారన్నారు. ఇప్పటికై నా అలగనూరు, గోరుకల్లు, వెలుగోడు రిజర్వాయర్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందేలా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 31న సిద్ధేశ్వరం అలుగు వద్ద భారీ జన సమీకరణతో తొమ్మిదో వార్షికోత్పవం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారు మల్లికార్జునరావుకు అందజేశారు.కార్యక్రమంలో సమితి సభ్యులు వైఎన్ రెడ్డి, రామగురివి రెడ్డి, పార్థసారధి రెడ్డి, హరిక్రిష్ణ, రామకృష్ణారెడ్డి, మహబూబ్బాషా, దేవానందరెడ్డి, పట్నం రాముడు, రవికుమార్రెడ్డి, కొమ్మా శ్రీహరి, తిమ్మారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వీరబ్రహ్మానందరెడ్డి, మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.