
ముస్లింల హక్కులు కాలరాస్తున్న బీజేపీ
కర్నూలు(సెంట్రల్): ముస్లింల హక్కులను బీజేపీ కాలరాస్తోందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాంగం జేఏసీ ప్రకటించింది. సోమవారం కర్నూలులో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు రోడ్డెక్కగా కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైనా బీజేపీ, టీడీపీ, జనసేన తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్, కోకన్వీనర్ ఎంఏ హమీద్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వక్ఫ్ చట్ట సవరణ చేశారన్నారు. ఈ కారణంగా తాము రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం అన్యాయమన్నారు. వక్ఫ్ చట్టాన్ని ప్రజల మద్దతు లేకుండా సవరణ చేశారని, దానిని అమలు చేయడానికి ఎంతమాత్రం వీలు లేదన్నారు. నిలుపుదల చేసే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు.
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్లో చట్ట సవరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలతో ఓటు వేయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలిపి ముస్లింలకు తీరని ద్రోహం చేశారన్నారు.
● వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ నాయకుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ తరపున వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు జరిగే అన్ని పోరాటాల్లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు.
● సీపీఎం, సీపీఐ నాయకులు డి.గౌస్దేశాయ్, ఎస్ఎండీ షరీఫ్, పి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కన్నేసి చట్ట సవరణ చేసిందన్నారు. దానిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ పి.రంజిత్బాషాకు జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నిరసనలో జైరాజ్(బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు), దాసరి ఎర్రన్న(కార్యదర్శి), అబ్దుల్లాఖాన్, జహంగీర్(ఎస్డీపీఐ), సయ్యద్ ఖాలిద్(ప్రాసిక్యూషన్ రిటైర్డ్ జేడీ), తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ సాగిందిలా..
ఉస్మానియా కాలేజీ ఆవరణలోని ఉర్దూ అరబిక్ పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వడ్డెగేరి, చిల్డ్రన్పార్కు, రాజ్విహార్ వరకు కొనసాగింది. అక్కడికి వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్, కల్లూరు తదితర ప్రాంతాల నుంచి కూడా కొన్ని ర్యాలీలు వచ్చి రాజ్విహార్ చేరుకున్నాయి. వీరంతా కలిసి వేలాది మంది ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఎదుట వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం
కర్నూలులో సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాగం
జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింల భారీ ర్యాలీ
మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ,
కమ్యూనిస్టులతో పాటు విద్యార్థి,
యుజవన, ప్రజా సంఘాలు

ముస్లింల హక్కులు కాలరాస్తున్న బీజేపీ

ముస్లింల హక్కులు కాలరాస్తున్న బీజేపీ