మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం (ఐజీఎంసీ) ఆవరణలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్ జూనియర్స్ బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ ప్రకటనలో తెలిపారు. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్లబ్లో సభ్యులై ఉండి, 2013వ సంవత్సరం తర్వాత పుట్టిన బాలబాలికలు ఈ ఎంపికలు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న బాలబాలికలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలోని పీఈఎస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగే 11వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ ఆధార్కార్డుతో నేడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఐజీఎంసీ స్టేడియంలో బాస్కెట్బాల్ కోర్డు దగ్గర హాజరు కావాలని తెలియజేశారు.
గుణదల (విజయవాడ తూర్పు): నివాసాల మధ్య గంజాయి విక్రయిస్తున్న యువకులను మాచవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్ సింగ్నగర్కు చెందిన గోసంగి లోహిత్, గుణదలకు చెందిన అలిమిల్లి సంపత్, మొగల్రాజపురానికి చెందిన చెల్లూరి దినేష్, అదే ప్రాంతానికి చెందిన కొరడ చరణ్, విశాఖపట్నం భీమిలికి చెందిన డోకర దుర్గారావు, లు విలాసాల కోసం అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఉన్నత వర్గాల యువతను టార్గెట్ చేసి కొంత కాలంగా గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రీస్తురాజపురం ఆర్ఎస్డీ హోటల్ సమీపంలో గంజాయిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులను దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి వారి నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు.


