ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో వేసవి చలువ పందిళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 14 లక్షల అంచనాతో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆలయ అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అమ్మవారి ఆలయం ఎదుట, రాజగోపురం ఎదుట కళావేదిక, ఘాట్రోడ్డు, కనకదుర్గనగర్, నటరాజ స్వామి వారి ఆలయం, లక్ష్మీగణపతి విగ్రహం వద్ద ఇలా పలు ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో త్వరితగతిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి వాస్తవ్యులు సుసర్ల వెంకట శశికృష్ణరాఘవ, జయ నందిని దంపతులు రూ. 1,00,111 ఆదివారం విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు విరాళాన్ని అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్
కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 6 తేదీ సోమవారం యథావిధిగా జరగనున్నట్లు ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్య క్రమంలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోసం అర్జీలు అందజేయవచ్చని వివరించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


