లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు ప్రభు అనుసరించిన క్షమాగుణం, త్యాగం, కరుణ, శాంతి మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు (బిషప్) మోస్ట్ రెవ. తెలగతోటి జోసఫ్ రాజారావు పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్క) పర్వదినం పురస్కరించుకొని బెంజిసర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ చర్చిలో సజీవుడైన ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పాస్క సందేశమిస్తూ క్రీస్తు పునరుత్థానంతో మానవాళి చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైందన్నారు. మరణించిన మహోన్నతుడైన ఏసు మూడవరోజు సజీవుడై లేచిన రోజే ఈస్టర్ పర్వదినమన్నారు. పాస్క (ఈస్టర్) అంటే మరణం జయించడమేనని ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పవిత్ర పూజాపీఠంపై బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ నక్కా డేవిడ్ రాజు, ఫాదర్ యం. ఉపేంద్ర, ఫాదర్ పి. అంబేద్కర్ ‘ఈస్టర్ సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. అంతకుముందు బిషప్ రాజారావు (పాస్క) కొవ్వొత్తిని వెలిగించి ఈస్టర్ వేడుకలను ప్రారంభించారు. పవిత్ర జలాన్ని ఆశీర్వదించారు. పూజానంతరం బిషప్ జోసఫ్ రాజారావు విజయవాడ కతోలిక పీఠం పరిధిలోని ప్రజలందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.
బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు


