మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఆరో రోజు శనివారం ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పది పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని వెల్లడించారు. జిల్లాలో ఎస్ఎస్సీ బయోలాజికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 21,716 మంది విద్యార్థులు నమోదు కాగా, 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 98.58గా నమోదైందని పేర్కొన్నారు. అలాగే ఏపీఓఎస్ఎస్ హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులకు గాను ఇద్దరూ హాజరయ్యారన్నారు. 100 శాతం హాజరు నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాయన్నారు. అదనంగా ఏడు జోన్లలో 33 విభాగ కమిటీలు, ఏసీజీఈ కృష్ణా, మచిలీపట్నం పరిధిలో నాలుగు ప్రత్యేక కమిటీలు పర్యవేక్షణ నిర్వహించాయని తెలిపారు.
నాలుగు పరీక్ష కేంద్రాలు తనిఖీ
గూడూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మల్లవోలు, కంకటావ, జెడ్పీహెచ్ఎస్ గూడూరు, ఏపీఆర్ఎస్ నిమ్మకూరు పాఠశాలలను డీఈఓ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.


