స్కాన్ సెంటర్లు చట్టబద్ధంగా పనిచేయాలి
మచిలీపట్నంఅర్బన్: స్కాన్ సెంటర్లు చట్టబద్ధంగా, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ వంటి అక్రమాలను కట్టుదిట్టంగా అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రీ–కన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం అమలును పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్కాన్, అల్ట్రాసౌండ్ కేంద్రాలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని నిరంతరం పరిశీలించాలని సూచించారు. సమావేశంలో కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం ఒక స్కాన్ సెంటర్, మార్పులు చేర్పుల కోసం ఐదు స్కాన్ సెంటర్లు, పునరుద్ధరణ కోసం మూడు స్కాన్ సెంటర్లు దరఖాస్తు చేసుకున్నాయని, సంబంధిత ఇన్స్పెక్షన్ రిపోర్టులను పరిశీలించిన అనంతరం అన్ని కేంద్రాలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి పి.యుగంధర్, అదనపు జిల్లా జడ్జి బి.బాబునాయక్, అదనపు ఎస్పీ వి.వి.నాయుడు, ఎన్జీఓ ఎం.ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం అని, ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఆ సినిమా హీరో అమర్దీప్ చౌదరి అన్నారు. ఈ నెల 6న విడుదల కానున్న ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ సభ్యులు శనివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్దీప్చౌదరి మాట్లాడుతూ.. నా కెరీర్ ‘రామ’ అనే పేరుతోనే మొదలైందనీ, ఈ చిత్రంలో కృష్ణ పేరుతో తన క్యారెక్టర్ ఉంటుందన్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని, మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. అనంతరం హీరోయిన్ శైలి మాట్లాడుతూ.. చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తిస్థాయి గ్రామీణ యువతీగా ఉంటుందన్నారు. హాస్య నటుడు టేస్టీ తేజ, దర్శకుడు ఎం.ఎం.నాయుడు, నిర్మాత సాయి పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావు శనివారం పదవీ విరమణ చేశారు. దీంతో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జీజీహెచ్కు పూర్తిస్థాయి సూపరింటెండెంట్ను నియమించే వరకూ డాక్టర్ ఏడుకొండలరావు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
స్కాన్ సెంటర్లు చట్టబద్ధంగా పనిచేయాలి
స్కాన్ సెంటర్లు చట్టబద్ధంగా పనిచేయాలి


