
అతి వేగానికి రెండు ప్రాణాలు బలి
గూడూరు: అతివేగం రెండు ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన శనివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై తరకటూరు దగ్గర జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాలు... జీవనోపాధి కోసం పెనమలూరు మండల పరిధిలో నివాసం ఉంటున్న పరిమి ఆదామ్ బాబు(19), కొమ్మవరపు షారీన్(19), కోట కౌషిక్(21) శనివారం ద్విచక్ర వాహనంపై మంగినపూడి బీచ్కు బయలుదేరారు. మధ్యాహ్నం పామర్రు మండలం నిమ్మకూరు నుంచి ఇటుకల లోడుతో మచిలీపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చి ఽఢీకొట్టారు. దీంతో వాహనం నడుపుతున్న ఆదామ్బాబు ఘటనా స్థలంలోనే మరణించాడు. వెనుక కూర్చున్న కొమ్మవరపు షరీన్, కోట కౌషిక్ తీవ్ర గాయాలపాలయ్యారు. షరీన్ను 108లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కౌషిక్కు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పెడన సీఐ నాగేంద్ర కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిమి ఆదామ్ బాబు(19), కోట కౌశిక్ (21) స్వస్థలం చందర్లపాడు మండలం పొన్నవల్లి గ్రామం కాగా, కొమ్మవరపు షారీన్(21) స్వస్థలం పల్నాడు జిల్లా అంబడిపూడి. వీరు ముగ్గురు సమీప బంధువులు.

అతి వేగానికి రెండు ప్రాణాలు బలి