
హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్పీ కృషి
హనుమాన్జంక్షన్ రూరల్: హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వ హిందూ పరిషత్ విశేష కృషి చేస్తుందని జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ శ్రీకాంత్ పరండే అన్నారు. హనుమాన్జంక్షన్లోని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్కుమార్ ఫామ్హౌస్కు సోమవారం ఆయన విచ్చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు విస్తృతం చేస్తామని చెప్పారు. తొలుత పుట్టగుంట ఫామ్హౌస్లోని శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీహెచ్పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మెడివ్యాలీ హాస్పిటల్స్ ఎండీ పంచకర్ల చక్రవర్తి, వీహెచ్పీ నాయకులు దుర్గా ప్రసాదరాజు, సరిపల్లి శివకుమార్ రాజు పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): గణేష్ నిమజ్జన సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు కోరారు. ఉత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తాము సంతాపం తెలియజేస్తున్నామని, మండప నిర్వాహకులు, భక్తులు పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ నిమజ్జనాలను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు మరిన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ నెల 4న అధికంగా నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సమితి ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ కోరారు.
మరోమారు సైబర్ నేరగాళ్ల పంజా
మహిళ వద్ద రూ.39 లక్షలు స్వాహా
పెనమలూరు: మండల పరిధిలో సైబర్ నేరగాళ్లు మరోమారు తమ పంజా విసిరారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా పోరంకిలో ఒక మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి ఏకంగా రూ.39,15,181 సొమ్ము స్వాహా చేశారు. ఈ ఘటన పై బాఽధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... 100 అడుగుల రోడ్డులోని అపార్టుమెంట్లో ఉంటున్న మహిళ (50)కు ఈ ఏడాది జూన్ 17వ తేదీన ఫయర్స్1916 నివేశ్ స్ట్రాటజీ వాట్సాప్ గ్రూప్లో ఆమెను సభ్యురాలిగా చేర్చారు.
ఆ గ్రూప్లో 94 మంది సభ్యులు ఉన్నారు. స్టాక్మార్కెట్కు సంబంధించిన సమాచారం గ్రూప్లో వచ్చేది. ఆ తరువాత ఆమెకు లింక్ పంపారు. ఆ లింక్ ద్వారా ఫయ్యర్స్యాప్లో నమోదై ఆమె పలు దఫాలుగా ఆన్లైన్లో రూ.39,15,181 సొమ్ము స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టింది. ఆమె పెట్టిన పెట్టుబడికి లాభాలు చూపారు. పెట్టిన పెట్టుబడి, లాభాలు విత్ డ్రా చేయటానికి ఆమె ప్రయత్నించగా గ్రూప్ నుంచి ఎటుంవంటి స్పందన కనపడక పోగా పెట్టిన పెట్టుబడి సున్నాగా చూపించారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాఽధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.