
హారిక దంపతులపై దాడి నీచమైన చర్య
పెడన: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళా అయినటువంటి ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాములపై టీడీపీ, జనసేన గుండాలు చేసిన దాడి చాలా నీచమైందని, హేయమైన చర్య అని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంక ట ప్రతాప్ అప్పారావు అన్నారు. ఆదివారం ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని హారిక, రాముల నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ నెల 12న గుడివాడలో జరిగిన దాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో దాడి జరిగితే అండగా ఉండకుండా నిందితులకు వత్తాసు పలకడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి రానీయకుండా పోలీసులు నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయనతో పాటు కృష్ణాజిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నూజివీడు అధ్యక్షుడు శివ తదితరులున్నారు.
జీతాల సమస్యలు
పరిష్కరించండి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రసాద్ మాట్లాడుతూ 2024, 2025 సంవత్సరాల్లో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యాలు, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ బోధనేతర పనుల నుంచి, యాప్ల నుంచి ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎం. కృష్ణ్ణయ్య, పి. లీల, పి. నాగేశ్వరరావు, మహేశ్వర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
తిరువూరు: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం తిరువూరు శ్రీవాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. సంఘ నూతన కార్యవర్గాన్ని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్. రాంబాబు నాయక్ (వత్సవాయి), ప్రధాన కార్యదర్శిగా ఈఎల్సీ కేశవరావు(ఏకొండూరు), కోశాధికారిగా సీహెచ్ వెంకటనారాయణ (కొండపల్లి), గౌరవాధ్యక్షుడిగా పీఎస్ఎన్ రాజు (తిరువూరు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఈ సుధాకర్ (విస్సన్నపేట), ఏ రాంబాబు (రుద్రవరం), సీహెచ్వీ సుబ్రహ్మణ్యం (విజయవాడ), కేంద్ర కార్యదర్శిగా ఆర్. విజయ రామారావు(విజయవాడ) ఎన్నికయ్యారు. సమావేశం ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి కొమ్మా విజయ్ ఆధ్వర్యంలో జరిగింది.
ప్రశాంతంగా
ఏపీపీఎస్సీ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: ఏపీపీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు కానూరులోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కృష్ణాజిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్లో 200 మంది అభ్యర్థుల్లో 133 మంది హాజరవ్వగా, 67 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్న సెషన్లో 873 మంది అభ్యర్థుల్లో 359 మంది మాత్రమే హాజరవ్వగా, 514 మంది గైర్హాజరైనట్లు డీఆర్ఓ తెలిపారు.

హారిక దంపతులపై దాడి నీచమైన చర్య

హారిక దంపతులపై దాడి నీచమైన చర్య