
కమిషనర్ V/s మేయర్
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారశైలిపై, కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. మేయర్ మాట్లాడుతూ 2024 మార్చి 11వ తేదీన పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆమోదించామని, అయితే ఈ బడ్జెట్కు సంబంధించి జమాఖర్చులు మొత్తం మునిసిపల్ కమిషనర్, ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగస్తులు అందరూ ఏకమై సుమారు రూ.32 కోట్ల సాధారణ నిధులను అత్యవసర ఖర్చుల పేరుతో ఉద్యోగస్తులకు చెక్కుల ద్వారా, పని అంచనాలను రూ.10 లక్షల్లోపు భాగాలుగా విభజించి పాలకవర్గం ఆమోదం లేకుండా సంవత్సరం బడ్జెట్ మొత్తాన్ని దుర్వినియోగం చేశారన్నారు. 2025 ఏప్రిల్ 1 తరువాత కూడా పనులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ విచ్చలవిడిగా కంటింజెంట్ బిల్లు కింద ఉద్యోగుల పేరు మీద లక్షల రూపాయలు చెక్కులు జారీ చేస్తూ నిధులను బ్యాంకుల నుంచి డ్రా చేస్తున్నారన్నారు.
కౌన్సిల్లో ప్రశ్నించినా సమాధానం
చెప్పని కమిషనర్
2025 ఏప్రిల్ 15వ తేదీన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను వీటిపై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. అదే సమావేశంలో తాము ఈ అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అవినీతి నిరోధకశాఖ అధికారులు కూలంకషంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామన్నారు. నగరపాలక సంస్థలో 2024 ఏప్రిల్1 నుంచి 2025 మార్చి వరకు జరిగిన ఆర్థిక లావా దేవీల పరిశీలనకు బ్యాంక్ స్టేట్మెంట్లు, సీఎఫ్ఎంఎస్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని లేఖ రాసినప్పటికీ కమిషనర్ ఇంత వరకు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి బందెల థామస్నోబుల్, నగర అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), ఉపాధ్యక్షుడు గూడ వల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్నెహ్రూ, తిరుమలశెట్టి ప్రసాద్, మొహమ్మద్ సాహెబ్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ కౌన్సిలర్లు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జి పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ కమిషనర్ వ్యవహారశైలిపై విచారణ చేపట్టండి
రూ.32 కోట్ల సాధారణ నిధులు
దుర్వినియోగం చేశారు
పాలకవర్గ తీర్మానం లేకుండా
నిధులు వెచ్చిస్తున్నారు
కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం
అందజేసిన మేయర్ వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు