
వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): వాణిజ్య బ్యాంకులకు దీటుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నామని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బ్యాంకు మహాజన సభ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు, ఉద్యోగులకు అర్హతను బట్టి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 7,500 డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు రుణాలు ఇచ్చామని, దీనిని 10 వేల సంఘాల వరకు పెంచి రుణాలు విస్తృతం చేయడానికి నిర్ణయించామన్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం జిల్లా రైతాంగానికి రూ.2 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. గృహా లు, వాహన కొనుగోలు, విద్యా రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు రూ.100 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3,200 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయని, దీనిని రూ.3,700 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్న ప్రదేశాల్లో ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్లలో ఈ–స్టాంపింగ్ బిజినెస్ ప్రారంభిస్తామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సంఘాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో సీఈవో ఎ.శ్యామ్మనోహర్, డీసీవో చంద్రశేఖరరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా డీసీవో శ్రీనివాసరెడ్డి, ఆప్కాబ్ జీఎం పీఎస్ మణి, జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, రంగబాబు పాల్గొన్నారు.
ఈ ఏడాది రూ.13,500 కోట్ల
టర్నోవర్ లక్ష్యం
బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు
చైర్మన్ నెట్టెం రఘురాం