
బంగారం రికవరీలో పోలీసుల చేతివాటం
గన్నవరం: చోరీకి గురైన బంగారం రికవరీ విషయంలో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు చేతివాటం ప్రదర్శించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు బంగారం కొనుగోలు చేసిన నగలు దుకాణం యాజమానిని కేసు నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు వసూలు చేశారు. అంతే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన బంగారంతో చోరీకి గురైన వస్తువులను తయారు చేయించి రికవరీ చూపించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు నగల వ్యాపారితో ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ఫోన్లో జరిపిన సంభాషణలు బయటకు రావడంతో పోలీసుల నిజస్వరూపం బట్టబయలైంది. వివరాలిలా వున్నాయి. ఇటీవల ఆత్కూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు బైక్లు, బంగారం, వెండి వస్తువులను రికవరీ చేశారు. వీరిని ఈ నెల 17న గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చూపించిన విషయం తెలిసిందే.
రెండు కాసుల రికవరీలో...
నిందితుల్లో ఒకరు చోరీ చేసిన రెండు కాసుల బరువైన రెండు బంగారు గొలుసులను ఏలూరులోని ఓ నగల వ్యాపారికి మాయమాటలు చెప్పి విక్రయించాడు. పట్టుబడిన దొంగ ఇచ్చిన సమాచారం మేరకు ఆత్కూరు పోలీసులు సదరు నగల వ్యాపారిని విచారించారు. అయితే సదరు వ్యాపారి నుంచి చోరీకి గురైన 22 క్యారెట్ బంగారు గొలుసులను రికవరీ చేయకుండా, అతనిని బెదిరించి తక్కువ నాణ్యత కలిగిన 18 క్యారెట్ బంగారంతో సదరు గొలుసులను తయారు చేయించారు. దీనికి ప్రతిఫలంతో పాటు నగల వ్యాపారిని కేసులో ఇరికిస్తామని భయపెట్టి రూ.30 వేలు నగదును పోలీసులు ముందుగానే వసూలు చేశారు. మరో రూ.10 వేలు నగదును ఆత్కూరు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగి ఖాతాకు ఫోన్పే ద్వారా జమ చేయించి వసూలు చేశారు. నగదు లావాదేవీలు, బంగారం నాణ్యత, తయారీ గురించి స్వయంగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ మహేష్ సదరు నగల వ్యాపారితో జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా డబ్బుల కోసం ఆత్కూరు పోలీసులు డిమాండ్ చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు నగల వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
నగల వ్యాపారితో ఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్ జరిపిన ఆడియో రికార్డులతో ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణాజిల్లా ఎస్పీకి కొంత మంది ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.
ఆరోపణలు అవాస్తవం...
రికవరీ చేసిన బంగారం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ సురేష్ వివరణ ఇచ్చారు. మొదట రికవరీ చూపించాల్సిన బంగారం కంటే తక్కువ బంగారం ఇవ్వడంతో మందలించామనే అక్కసుతో సదరు వ్యాపారి తమపై ఫిర్యాదు చేసి ఉండవచ్చన్నారు. చోరీ కేసుల విచారణ, దొంగలను పట్టుకునేందుకు అయ్యే ఖర్చులను రాబట్టేందుకు నగల వ్యాపారిని తమ సిబ్బంది నగదు అడిగి ఉండవచ్చని అన్నారు.