
అస్త్ర వారాహిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం
నాగాయలంక: కృష్ణానదీ తీరంలోని శ్రీరామపాదక్షేత్రంలో ఉన్న శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం అమ్మవారు అస్త్ర వారాహిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. వారాహి సంప్రద్రాయ నియమ నిష్ఠల దీక్షాబద్దులైన ఆలయ అర్చకులు ముదునూరి శ్రీనివాసశాస్త్రి, అచ్యుత శేఖరశర్మ బ్రహ్మత్వంలో ప్రాతఃకాలంలో వారాహి మాతకు శాస్త్రోక్త పూజ జరిపి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. విశేష అలంకారం తదుపరి భక్తుల దర్శనానికి అవకాశం కలిగించారు. ఈ సందర్భంగా పీఠం వద్ద కామాడి దుర్గాప్రసాద్–సీత దంపతులు పీటలపై కూర్చున్నారు. శ్రీరామక్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉప్పల లీలాకృష్ణ ప్రసాద్(బుజ్జి) కమిటీ పెద్దలు పర్యవేక్షించారు.
పాలిసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు 148, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 213 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 170 మంది జనరల్ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 531 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
నేటి షెడ్యూల్
శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 120001 నుంచి 127000 లోపు ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 127001 నుంచి చివరి ర్యాంకు పొందిన జనరల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేది సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.