విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు పత్తా లేని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు
అలంకార ప్రాయంగా రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా కియోస్క్లు
అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతుల విన్నపం
కంచికచర్ల: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే తలుపుతట్టాయి. వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ తరుణంలో రైతులకు సలహాలిచ్చేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రాల్లో కనిపించటంలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. పేరు మార్చితే మార్చారు... రైతులకు అందించవలసిన సేవలను పూర్తిగా దూరం చేసింది. దాంతో అవి ఉండీ నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూలనపడ్డ కియోస్క్లు
గత ప్రభుత్వంలో ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుమందులు బుక్ చేసుకునే అవకాశం లభించింది. వాతావరణంలో మార్పులు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ సూచనలు, సలహాలు, పంట ఉత్పత్తులు, మద్దతు ధర కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునేవారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలను ఉపయోగించకుండా మూలన పడేశారు.
ఇప్పటికీ అదే నిర్లక్ష్యం..
జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 270 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రూ.59 కోట్లు మంజూరు చేసి సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని పలు గ్రామాల్లో 120 పక్కా భవనాలు నిర్మించింది. మరో 150 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులను నిలిపివేసింది. రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది కాని సేవలను దూరం చేసింది. కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ఆయా భవనాల్లో కొన్నింటిని వినియోగిస్తోంది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని సర్వేలు, పింఛన్ల పంపిణీ అంటూ బయటకు పంపిస్తోంది. దీంతో రైతులకు సేవలు అందడం లేదు.
మొక్కజొన్న వైపు మొగ్గు...
ఈ ఏడాది రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. చీడపీడలు తట్టుకోవటంతో పాటు తక్కువ పెట్టుబడి అవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న పంటకు సకాలంలో మద్దతు ధర ప్రకటించకపోయినా లేదా కొనుగోలుచేయకపోయినా సరే ఈ ప్రాంతంలో ఇథనాల్ కర్మాగారాలు ఉండటంతో మొక్కజొన్న పంటకు మంచి ధర లభిస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదైనా..
రానున్న ఖరీఫ్ సీజన్లో అయినా ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేసుకునేందుకు కియోస్క్ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల నుంచి వాతావరణం గురించి తెలియకపోవటంతో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట ఉత్పత్తులు తడిసి ముద్దవుతున్నాయి. అదే కియోస్క్లు పనిచేస్తుంటే వాతావరణం గురించి తెలుసుకుని ముందుగా పంట ఉత్పత్తులను కాపాడుకునేవారమని పలు మండలాల రైతులు అంటున్నారు.
ఈ ఏడాది పత్తి సాగు కష్టమే...
రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు పత్తి సాగు చేసేందుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది పత్తి పంటకు ఆశించిన మేర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. చీడపీడలు పత్తిని నాశనం చేశాయి. అకాల వర్షాల వల్ల పత్తి పంట చాలా దెబ్బతింది. పత్తి పంట సాగుకు పెట్టుబడి కూడా ఎక్కువ అయిందని రైతులు అంటున్నారు.
గ్రీన్ ట్యాక్స్పై జీవోను విడుదల చేయాలని వినతి
విజయవాడస్పోర్ట్స్: ఏడేళ్లు దాటిన సరుకు రవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు అన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డిని ఈశ్వరరావు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ట్యాక్స్ తగ్గింపునకు జీవోను వెంటనే విడుదల చేయాలని మంత్రిని ఆయన కోరారు. దీనిపై మంత్రి రామ్ప్రసాద్రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ వారంలోనే ట్యాక్స్ తగ్గింపుపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, కార్యదర్శి సీహెచ్ వినయ్ ఉన్నారు.
తైక్వాండోలో జిల్లాకు 68 పతకాలు
విజయవాడస్పోర్ట్స్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మూడు రోజుల పాటు జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు 68 పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, కోచ్లు పి.విక్టర్ ఆదిత్య, కె.కృష్ణవంశీ, బి.దినేష్, బి.కాశీనాథ్రెడ్డి, పి.గౌరిశంకర్, ఎం.బాలచందర్ అభినందించారు.
దరఖాస్తులు ఆహ్వానం
ఘంటసాల: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్య ప్రియలలిత గురువారం తెలిపారు. పదో తరగతి, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం కల్పిస్తున్న అవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాన్నారు. మరిన్ని వివరాలకు 08671 – 254499 సంప్రదించాలని కోరారు.