
సమస్యల మధ్యే ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బడి గంటలు గణగణ మోగాయి. సుమారు 50 రోజుల వేసవి సెలవుల అనంతరం బాలబాలికలు ఉత్సాహంగా బడిబాట పట్టారు. నిన్నటి వరకూ బోసిపోయిన పాఠశాల ప్రాంగణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు పాడ్యమి తిథి రావడంతో తల్లిదండ్రులు మంచి రోజుగానే భావించి తమ పిల్లలను పాఠశాలలకు పంపించారు.
సమస్యల స్వాగతం..
తొలి రోజు విద్యార్థులకు ఆయా పాఠశాల్లోని సమస్యలు స్వాగతం పలికాయి. పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు ఇంకా పూర్తి కాకపోవటంతో చాలా మంది మచిలీపట్నంలో ఉన్నారు. బుధవారం బదిలీలు పొందిన ఉపాధ్యాయులు గురువారం ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. అదేవిధంగా బదిలీపై కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు సైతం గురువారం రోజునే ఆయా పాఠశాల్లో రిపోర్ట్ చేశారు. దాంతో కొన్ని విద్యాసంస్థల్లో సగం కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు బదిలీపై ఉండటంతో ఆయా ప్రాంగణాల్లో అంతా గందరగోళం నెలకొంది.
అరకొరగానే కిట్లు పంపిణీ..
సాధారణంగా పాఠశాలలు తెరిచిన తొలి రోజే పుస్తకాలు ఇతర సామగ్రిని అందించేందుకు గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేది. ప్రభుత్వం మారటంతో పంపిణీ కార్యక్రమంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైన విషయాన్ని తొలిరోజే మరోసారి స్పష్టమైంది. పుస్తకాలు ఇతర కిట్ల పంపి ణీకి సంబంధించి నిర్ధిష్టమైన ఉపాధ్యాయులు కేటాయింపు జరగకపోవటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తొలి రోజు కనిపించాయి. కేవలం పుస్తకాలు మాత్రమే పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. అది సైతం కేవలం కొన్ని పాఠశాలల్లోనే జరిగింది. స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, సాక్సులు, బూట్లు ఇలా చాలా వస్తువులు విద్యార్థులకు అందలేదు. విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో పాఠశాలలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభమయ్యాయని, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాల కిట్ను సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.
తొలి రోజు అంతా గందరగోళం పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందజేత యూనిఫామ్, బ్యాగులు, ఇతర సామగ్రి ఇవ్వని వైనం