
చాలీ చాలని జీతాలతో బతికేదెలా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాలీచాలని జీతాలతో బతుకీడ్చేదెలా అంటూ మునిసిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో వారు గత నెలరోజులుగా ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు పిట్టా మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు దఫాలు చర్చల పేరుతో పిలిచి ఎటువంటి హామీ గానీ, ఉత్తర్వులు గాని ఇవ్వలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు వేముల జైపాల్, పరసా బుచ్చిబాబు, బి.నాగరాజు, సీహెచ్ సాంబశివరావు, పి.కృష్ణ, ఎండీ గౌస్, కార్మికులు పాల్గొన్నారు.
నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించని ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ధర్నా